పుంగనూరులో టెన్షన్..టెన్షన్
ABN , Publish Date - Aug 18 , 2024 | 12:41 AM
మండల మీట్ జరగనివ్వబోమన్న టీడీపీ శ్రేణులు భారీగా పోలీసు బలగాల మోహరింపు గైర్హాజరైన వైసీపీ సభ్యులు కోరం లేక వాయిదాపడ్డ సమావేశం
పుంగనూరు రూరల్, ఆగస్టు 17: పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం టెన్షన్ వాతావరణం నెలకొంది. మండల సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీపీ భాస్కర్రెడ్డి సమాచారం ఇవ్వడంతో అధికారులు కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. వైసీపీ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాలేదని, నామినేటేడ్ తరహాలో ఎన్నికయ్యారని, అందుకే మండల మీట్ జరగనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎంపీడీవో అబ్దుల్రహీంకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ నేతలు పెద్దయెత్తున చేరుకోవడంతో పుంగనూరు రూరల్, గంగవరం సీఐలు రాంభూపాల్, ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో ఎంపీపీ భాస్కర్రెడ్డి సహా సభ్యులు ఎవరూ హాజరుకాలేదు. కేవలం అధికారులు మాత్రమే రావడం, సభ్యులు లేకపోవడంతో కోరం లేదని సమావేశాన్ని ఎంపీడీవో వాయిదా వేశారు. వైసీపీకి చెందిన కోఆప్షన్ సభ్యులు బావాజాన్, గుడిసింబడ, సింగిరిగుంట సర్పంచులు శోభారాణి, ఆంజప్ప రాగా సభ్యులు ఎవరూ కనిపించకపోవడంతో వెనుదిరిగారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.