సత్యవేడులో సర్వేతో అలజడి
ABN , Publish Date - Feb 12 , 2024 | 01:54 AM
అభ్యర్థి ఎంపిక విషయంపై టీడీపీ అధిష్ఠానం నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే.
![సత్యవేడులో సర్వేతో అలజడి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సత్యవేడు, ఫిబ్రవరి 11: అభ్యర్థి ఎంపిక విషయంపై టీడీపీ అధిష్ఠానం నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల, కార్యకర్తలకు ఫోన్ కాల్స్ వచ్చాయి. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటూ అని అభిప్రాయ సేకరణ జరిపారు. సత్యవేడు టీడీపీ ఆశావహ అభ్యర్థి చందన స్రవంతి, నోటా పేర్లతో అభిప్రాయాన్ని ఫోన్ కాల్స్ ద్వారా అడిగారు. చందన కావాలంటే 1 నొక్కండి, వద్దంటే(నోటా) 2 నొక్కండి అని వచ్చిన ఫోన్ కాల్స్ చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సర్వేల్లో కనీసం ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేర్లుంటాయి. సత్యవేడు నాయకులకు వచ్చిన ఫోన్ కాల్లో ఒకే ఒక పేరును సూచిస్తూ అభిప్రాయాల సేకరణ జరపడంతో ఇది పార్టీ నిర్వహిస్తున్న సర్వే కాదని మెజారిటీ నాయకులు అభిప్రాయపడ్డారు.