ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Mar 12 , 2024 | 01:47 AM
పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు.
పుంగనూరు అధికారుల సమీక్షలో కలెక్టర్ హెచ్చరిక
పుంగనూరు, మార్చి 11: పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ షన్మోహన్ ఆదేశించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. నియోజకవర్గపరిధిలో అధికారుల పనితీరును ఎన్నికల పరిశీలకులు క్షుణ్ణంగా పరిశీలిస్తారని చెప్పారు. ఎవరూ విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని, పొరబాట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ (ఎంసీసీ) అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. ప్రతి కార్యాలయంలో ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించి ఫొటోలు, బ్యానర్లు తొలగించాలన్నారు. జిల్లా కేంద్రంలోను కంట్రోల్ రూమ్ ఉంటుందని.. నియోజకవర్గ స్థాయిలోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి రిపోర్టును ఆర్వో ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి పంపాలన్నారు. సీ విజిల్యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను 100 నిమిషాల వ్యవధిలోనే పరిశీలించి నివేదికను జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అదే రోజు పంపాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మౌళిక సదుపాయాలు, ఇంటర్నెట్ సౌకర్యంపై ఏఈఆర్వోలు పరిశీలించి నివేదిక పంపాలన్నారు. ఎన్నికల సమయంలో ఎవరికీ సెలవులు ఇవ్వొద్దన్నారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, ఆర్టికల్స్ పంపిణీ చేస్తే వీడియో తీయాలన్నారు. కాగా, ఈవీఎంలను భద్రపరచడానికి పట్టణ సమీపంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో స్ర్టాంగ్ రూములు, రిసెప్షన్ సెంటర్లను ఆయన పరిశీలించారు. జేసీ శ్రీనివాసులు, పుంగనూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్రెడ్డి, డీఎస్పీ మహేశ్వర్రెడ్డి, తహసీల్దార్ శివయ్య, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి, ఎంపీడీవో మునిరెడ్డి, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, గంగాధరనెల్లూరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోనూ ఎన్నికల నిర్వహణపై ఆయా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.