కుప్పం రెస్కోలో సర్వీస్ రిజిస్టర్ మాయం
ABN , Publish Date - Jun 08 , 2024 | 01:48 AM
కుప్పం గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ (రెస్కో)లో సర్వీస్ రిజిస్టర్ ఒకరోజుపాటు మాయమైంది. దీనిపై విషయం బయటకు పొక్కగానే తిరిగి కార్యాలయంలో ప్రత్యక్షమైంది. దీనికి బాధ్యులైన ఎస్టాబ్లి్షమెంట్ జేఏవో ఎం.కృష్ణమూర్తికి ఎండీ ప్రభాకర్ మెమో జారీ చేశారు.
ఎస్టాబ్లి్షమెంట్ జేఏవో కృష్ణమూర్తికి మెమో
కుప్పం, జూన్ 7: కుప్పం గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ (రెస్కో)లో సర్వీస్ రిజిస్టర్ ఒకరోజుపాటు మాయమైంది. దీనిపై విషయం బయటకు పొక్కగానే తిరిగి కార్యాలయంలో ప్రత్యక్షమైంది. దీనికి బాధ్యులైన ఎస్టాబ్లి్షమెంట్ జేఏవో ఎం.కృష్ణమూర్తికి ఎండీ ప్రభాకర్ మెమో జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పం రెస్కోలో ఐదేళ్ల వైసీసీ పాలనలో చాలా అవకతవకలు చోటు చేసుకున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల ప్రచారాంశాల్లో దీనినీ చేర్చింది. అక్రమ నియామకాలు జరిగాయని, అందుకు లక్షల్లో ముడుపులు అధికారులకు, వైసీపీ నేతలకు ముట్టాయన్న ఆరోపణలు తీవ్రంగా చేసింది. ఎన్నికలు ముగిసి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజున ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, కుప్పం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కుప్పంలోని ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి చోటు చేసుకుందని, విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే క్రమంలో కుప్పం రెస్కోలో జరిగిన అవినీతి, అక్రమ నియాకాలతోపాటు ఇతర అక్రమాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని స్పష్టంగా చెప్పారు. ఆ మరుసటి రోజునే అంటే, 6వ తేదీ గురువారంనాడు కుప్పం రెస్కోలోని ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్ మాయమైనట్లు ప్రచారం జోరుగా జరిగింది. దీనిపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సీరియస్ అయినట్లు తెలిసింది. వెంటనే రెస్కో ఎండీ ప్రభాకర్కు ఆయన ఫోన్ చేసి తీవ్రస్థాయిలో మందలించినట్లు సమాచారం. రెస్కోలో అందరి జాతకాలు తనవద్ద ఉన్నాయని, వెంటనే సర్వీసు రిజిస్టర్ తిరిగి కార్యాలయానికి చేరకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ఆందోళన చెందిన ఎండీ ప్రభాకర్.. సర్వీస్ రిజిస్టర్ గురించి విచారిస్తే ఎస్టాబ్లి్షమెంట్ డిపార్ట్మెంట్ జేఏవో ఎం.కృష్ణమూర్తి సర్వీస్ రిజిస్టర్ తెరచినట్లు, బయటకు కూడా తీసుకువెళ్లినట్లు తెలిసింది. దీనిపై కృష్ణమూర్తికి ఎండీ ప్రభాకర్ శుక్రవారం మెమో జారీ చేశారు. పైన పేర్కొన్న పొరపాట్లకు సంబంధించి మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అదేశించారు.
ఆ అక్రమాలు సరిచేసేందుకేనా?
ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన అక్రమ నియామకాలను సరిచేసేందుకే సర్వీసు రిజిస్టర్ మాయం చేశారని టీడీపీ అనుమానిస్తోంది. ప్రభుత్వం మారడం.. అక్రమ నియామకాలు, డబ్బుల వసూళ్లపై విచారణ జరిపిస్తామని టీడీపీ ప్రకటించడం.. దీనిపై ప్రాథమిక సాక్ష్యాధారలను సేకరించి పెట్టుకున్న క్రమంలో సర్వీస్ రిజిస్టర్ మాయమవడం గమనార్హం. ఉద్యోగుల సర్వీసును, అంటే వారు ఎంతకాలంగా ఏ హోదాలో సంస్థలో పనిచేస్తున్నారన్న విషయాన్ని నిర్ధారించేది సర్వీసు రిజిస్టర్. ఎన్నికల ముందు జరిగిన నియామకాలను కూడా చాలాకాలం కిందటే జరిగినట్లుగా, అందుకనే వారి నియామకాలు, పదోన్నతులతోపాటు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ సక్రమంగా జరిగాయని నిర్ధారించేందుకు తేదీలు మార్పు చేయడానికే దీనిని వెలుపలికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరలో రెస్కోలో విచారణ జరిపించి ఇన్నాళ్లుగా సంస్థలో జరిగిన అక్రమాలు, అవినీతి చర్యలన్నింటినీ బయట పెట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న కృతనిశ్చయంతో టీడీపీ నేతలున్నారు.