సీపీఎస్ ఉద్యోగుల జీతాలకు బ్రేక్
ABN , Publish Date - May 30 , 2024 | 01:01 AM
సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. ట్రెజరీ ద్వారా ప్రాన్ నెంబరు పొందని ఉద్యోగులందరికీ మేనెల జీతాలు ఆపివేయాలని ఆ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
![సీపీఎస్ ఉద్యోగుల జీతాలకు బ్రేక్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఫ మేనెల జీతాలు నిలుపుదల
చిత్తూరు కలెక్టరేట్, మే 29: సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. ట్రెజరీ ద్వారా ప్రాన్ నెంబరు పొందని ఉద్యోగులందరికీ మేనెల జీతాలు ఆపివేయాలని ఆ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలో వివిధశాఖల్లో సీపీఎస్ పద్ధతిలో 8732 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగంలో కొత్తగా చేరిన సీపీఎస్ ఉద్యోగికి ప్రాన్ నెంబర్ లేకపోయినా తొలి నెలలో జీతం ఇస్తారు. ఆ తర్వాత నెలలో ఆన్లైన్ ద్వారా ఆ ఉద్యోగి ప్రాన్ నెంబరు కోసం ట్రెజరీకి దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగి వివరాలు పరిశీలించి ట్రెజరీ అధికారి ప్రాన్ నెంబర్ కేటాయిస్తారు. 2004నుంచి అమలవుతున్న సీపీఎస్ ఉద్యోగి నుంచి 10శాతం మొత్తాన్ని ప్రతినెలా పే, డీఏల నుంచి కట్చేస్తారు. ఆ ఉద్యోగికి ప్రభుత్వం కూడా 10శాతం మొత్తాన్ని జమచేస్తోంది. ఈ రెండు మొత్తాలు సదరు ఉద్యోగి పదవీ విరమణ పొందాక అందుతాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ప్రాన్ నెంబరును చాలామంది సీపీఎస్ ఉద్యోగులు తీసుకోలేదు. అలాంటి వారందరికీ మేనెల జీతాలు ఆగిపోనున్నాయి. రెండు రోజుల కిందట జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) మినహాయింపులు లేని రెగ్యులర్ ఉద్యోగుల జీతాల బిల్లులను ఈనెల ఆపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. వారితో పాటు తాజాగా సీపీఎస్ ఉద్యోగుల జీతాలను కూడా నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.