Share News

చిత్తూరు ఎంపీ టీడీపీ అభ్యర్థిగా విశ్రాంత ఐఆర్‌ఎస్‌ ప్రసాద్‌రావు?

ABN , Publish Date - Mar 07 , 2024 | 02:06 AM

తెలుగుదేశం పార్టీ నుంచి చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి దగ్గుమళ్ల ప్రసాద్‌రావును దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

చిత్తూరు ఎంపీ టీడీపీ అభ్యర్థిగా విశ్రాంత ఐఆర్‌ఎస్‌ ప్రసాద్‌రావు?
చంద్రబాబుతో ప్రసాద్‌రావు

చిత్తూరు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నుంచి చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి దగ్గుమళ్ల ప్రసాద్‌రావును దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సివిల్స్‌ సర్వీసె్‌సలో ఐఆర్‌ఎస్‌ అధికారిగా ఎంపికై, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ విభాగంలో జాయింట్‌ కమిషనరుగా పనిచేసిన ప్రసాద్‌రావు 2019లో ముందస్తు పదవీ విరమణ తీసుకున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన ఈయన హైదరాబాద్‌ పరిసరాల్లో నిర్మాణ రంగ వ్యాపారంలో ఉన్నారు. బాపట్ల ఎంపీ సీటుకోసం ప్రయత్నించిన ఈయనను చిత్తూరుకు చంద్రబాబు ఎంపిక చేశారని తెలుస్తోంది. గత ఎన్నికల అనుభవంతో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ చిత్తూరు ఎంపీ స్థానాన్ని గెలిచి తీరాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. గతంలో కుప్పం, పలమనేరుల్లోని ఆధిక్యతతోనే చిత్తూరు ఎంపీ స్థానాన్ని టీడీపీ సులువుగా గెలుచుకునేది. ప్రస్తుతం చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ బలంగా ఉంది. గట్టిగా గెలిచే సీటు కావడంతో పలువురు ఆశించారు. జీడీనెల్లూరు నియోజకవర్గానికి చెందిన, పలువురు ప్రధాన మంత్రుల వద్ద చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌గా పనిచేసిన విశ్రాంత ఎస్పీ మునుస్వామి, సినీ నటుడు సప్తగిరి, వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్‌.గాంధీ ఇక్కడి నుంచి పోటీచేయడానికి ఉత్సాహం చూపారు. అందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఆర్థికంగా బలంగా ఉండి, ఉన్నతోద్యోగంలో రిటైరైన మంచి చరిత్ర గల వ్యక్తిని ఎంపిక చేశారని అంటున్నారు.

Updated Date - Mar 07 , 2024 | 02:06 AM