పుత్తూరు బైపాస్లో పట్టుబడ్డ కర్ణాటక మద్యం
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:44 AM
నారాయణవనం మండల పరిధిలోని కల్యాణపురం వద్ద గురువారం రాత్రి భారీ మద్యం డంప్ను పోలీసులు సీజ్ చేశారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువు అరెస్ట్
వైసీపీ నాయకులే డంప్ చేశారన్న అనుమానాలు
పుత్తూరు అర్బన్/నారాయణవనం, ఏప్రిల్ 19: నారాయణవనం మండల పరిధిలోని కల్యాణపురం వద్ద గురువారం రాత్రి భారీ మద్యం డంప్ను పోలీసులు సీజ్ చేశారు.సీఐ భాస్కర్ నాయక్ కథనం మేరకు....పుత్తూరు బైపాస్ రోడ్డులోని కల్యాణపురం వద్ద ఇద్దరు వ్యక్తులు ఆటోలో 46 మద్యం కేసులను తరలిస్తున్నట్లు ఎస్ఐ లక్ష్మీనారాయణ గుర్తించారు. విచారణలో స్థానికుడైన శివ లీజుకు తీసుకుని నడిపిస్తున్న ఎస్ఎ్సఎస్ వెయింగ్ మెషిన్ వద్ద 239 మద్యం కేసులు నిల్వ ఉంచి, అక్కడి నుంచి మరొక చోటకు తరలిస్తున్నట్లు తేలింది.మద్యాన్ని అక్కడ నిల్వ చేసిన సీఎస్ దిలీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. దీంతో మొత్తం 285 మద్యం కేసులతో పాటు తిరునావక్కరసు, లీలాకృష్ణ, శివతో పాటు మద్యం తరలిస్తున్న ఆటోను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.అయితే మద్యం డంప్ వ్యవహారంలో అన్ని వేళ్లూ అధికార పార్టీ వైపే చూపిస్తున్నాయి.మద్యం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ సమీప బంధువు తిరువనావక్కరసు కాగా మరొకరు ఆటో డ్రైవర్. వీరిని ప్రశ్నించిన పోలీసులకు వేబ్రిడ్జి గదిలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 239 కేసుల కర్ణాటక మద్యం గురించి తెలిసింది. ఇంత భారీస్థాయిలో మద్యం నిల్వ చేయడం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే పోలీసులు అరెస్ట్ చేసిన తిరువనాక్కరసు గేటు పుత్తూరులో వైసీపీ నాయకుడిగా ఉన్నారు.ఈయన బంధువు శంకర్ మున్సిపల్ వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. పైగా పోలీసులు చెబుతున్నట్లు మద్యం డంప్ దొరికిన వేబ్రిడ్జి కూడా మరో వైసీపీ నాయకుడిదిగానే తెలుస్తోంది. కర్నాటక మద్యాన్ని ఎన్నికల కోసమే డంప్ చేసి ఉంచారనే ప్రచారం సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో మద్యం దిగుమతి చేసుకుని ఆయా మండలాల్లో డంప్లను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.