5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
ABN , Publish Date - May 03 , 2024 | 02:20 AM
జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 5, 6 తేదీలలో సంబంధిత ఆర్వో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ షన్మోహన్ కోరారు.
![5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు](https://media.andhrajyothy.com/media/2024/20240428/2ctr11_web_4b9866a4c3.jpg)
చిత్తూరు కలెక్టరేట్, మే 2: జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 5, 6 తేదీలలో సంబంధిత ఆర్వో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ షన్మోహన్ కోరారు. ఫారం-12, ఫారం 12బి ద్వారా 16,571 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉన్నట్లు వెల్లడించారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన 3,449 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 585 మంది అత్యవసర సర్వీసుల వారు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోలేకపోయిన జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు ఆధార్కార్డు, ఓటరు ఐడీ కార్డు, ఎన్నికల విధులకు జారీ చేసిన ఉత్తర్వు కాపీలను ఆయా ఆర్వో కేంద్రా ల్లో చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్కు అర్హత కలిగిన 566 మంది ఈనెల 6, 7 తేదీల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చామన్నారు.
మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
చిత్తూరు : పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్ల(సూక్ష్మ పరిశీలకులు) పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ అన్నారు. గురువారం నాగయ్య కళాక్షేత్రంలో మైక్రో అబ్జర్వర్లకు ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. 425 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, నిరంతర వీడియోగ్రఫీ చేయాలని సూచించారు. సాధారణ పరిశీలకులు సాధిక్ ఆలం, కైలాస్ వాంఖడే, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ పాల్గొన్నారు.