ఎర్రచందనం స్వాధీనం
ABN , Publish Date - Aug 05 , 2024 | 01:38 AM
ఎస్ఆర్పురం మండలంపిళ్లారికుప్పం గ్రామంలోని మామిడి తోపులో రూ.7 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు.
ఫ స్మగ్లర్ను వదిలి కూలీని అరెస్టు చేయడంపై టీడీపీ నిరసన
శ్రీరంగరాజపురం, ఆగస్టు 4: ఎస్ఆర్పురం మండలంపిళ్లారికుప్పం గ్రామంలోని మామిడి తోపులో రూ.7 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఉన్న స్మగ్లర్, వైసీపీ నేతను వదిలి కూలీని అరెస్టు చేయడాన్ని టీడీపీ నాయకులు తప్పుబట్టారు. ఎస్ఐ కుళాయిప్ప తీరును నిరసిస్తూ చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. స్మగ్లర్ను తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వార్త కవరేజ్ కోసం వెళ్లిన ఓ విలేకరి సెల్ఫోన్ను ఎస్ఐ లాక్కోవడం వెనుక అర్థమేమిటని నిలదీశారు. విషయం తెలుసుకున్న కార్వేటినగరం సీఐ సత్తిబాబు అందోళనకారులను స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. విచారించి స్మగ్లర్పైనా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు శాంతించారు. కాగా, పోలీసులు ఇప్పటికే ఆ వైసీపీ నేతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.