Share News

తెల్లవారుజామున 3 వరకు ఎస్‌.బండపల్లెలో పోలింగ్‌

ABN , Publish Date - May 15 , 2024 | 12:16 AM

వి.కోట మండలం ఎస్‌.బండపల్లెలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలింగ్‌ ముగిసింది. సోమవారం ఉదయం ఈవీఎంలలో మాక్‌పోల్‌ నిర్వహించి పోలింగ్‌ ప్రారంభించే సరికి గంట ఆలస్యమైంది.

 తెల్లవారుజామున 3 వరకు  ఎస్‌.బండపల్లెలో పోలింగ్‌
ఎస్‌.బండపల్లెలో సోమవారం అర్ధరాత్రి దాటాక..

వి.కోట, మే 14: వి.కోట మండలం ఎస్‌.బండపల్లెలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలింగ్‌ ముగిసింది. సోమవారం ఉదయం ఈవీఎంలలో మాక్‌పోల్‌ నిర్వహించి పోలింగ్‌ ప్రారంభించే సరికి గంట ఆలస్యమైంది. అప్పటికే పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. ఈవీఎంల వినియోగంపై వృద్ధులకు సరైన అవగాహన లేకపోవంతో వారికి మరొకరు సహకరించడం తదితర కారణాలతో నెమ్మదిగా ఓటింగ్‌ ప్రక్రియ సాగింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ గడువు ముగిసే సమయానికి 212, 213 పోలింగ్‌ కేంద్రాలో 400 మందికి పైగా ఓటర్లు క్యూలో ఉన్నారు. వీరికి టోకెన్లు ఇచ్చి పోలింగ్‌ కొనసాగించారు. 213వ పోలింగ్‌ కేంద్రంలో రాత్రి 10 గంటలకు పోలింగ్‌ ముగిసింది. 212 కేంద్రంలో అర్ధరాత్రి 12 గంటలకు వీవీప్యాడ్‌ స్విచ్‌ ఆఫ్‌ అయింది. అప్పటికి 50 మందికిపైగా ఓటర్లు ఉన్నారు. మరో వీవీప్యాడ్‌నును మంగళవారం తెల్లవారు జామున 1.30 గంటలకు అమర్చారు. తెల్లవారు జామున 3 గంటలకు పోలింగ్‌ పూర్తి చేశారు. అప్పటి వరకు ఓటర్లు ఓపిగ్గా ఉండి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 5.30 గంటలకు ఈవీఎం బాక్సులను స్ర్టాంగ్‌ రూంకు తరలించారు. మొత్తానికి 212లో 1291 ఓట్లకు 1144 ఓట్లుపోలై 86.6 శాతం, 213లో 1252 ఓట్లకు 1120 89.4 శాతం పోలింగ్‌ నమోదైంది.

Updated Date - May 15 , 2024 | 12:16 AM