అంతా అయ్యాక అనుమతులు!
ABN , Publish Date - Mar 01 , 2024 | 02:16 AM
వ్యవపాయ భూమిలో ఏదైనా లే అవుట్ వేయాలంటే నివాసయోగ్యమైన స్థలంగా ప్రభుత్వం దగ్గర మార్చుకోవాలి.
టీటీడీ ఉద్యోగుల లేఅవుట్కు వ్యవసాయ భూమి నుంచి రెసిడెన్షియల్గా వర్గీకరణ
ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రోడ్డు రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
తిరుపతి, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): వ్యవపాయ భూమిలో ఏదైనా లే అవుట్ వేయాలంటే నివాసయోగ్యమైన స్థలంగా ప్రభుత్వం దగ్గర మార్చుకోవాలి. ఆ తర్వాత స్థానిక పట్టణాభివృద్ధి సంస్థ అప్రూవల్ తీసుకోవాలి. అప్పుడే ప్లాట్లను విక్రయించడం, రిజిస్ర్టేషన్ చేయడం జరుగుతుంది. కానీ టీటీడీ ఉద్యోగులకు వడమాలపేట దగ్గర ఇచ్చిన ప్లాట్లకు మాత్రం ఇలాంటి నిబంధనలు ఏమీ వర్తించలేదు. ఎలాంటి అనుమతులూ లేకుండానే పేపర్పై స్కెచ్ వేసి, లాటరీ తీసి నెంబర్లు కేటాయించేశారు.అంతేకాదు కొందరికి రిజిస్ట్రేషన్ తంతు కూడా పూర్తిచేశారు. అంతా అయ్యాక ఇప్పుడు భూమి మార్పుకోసం అందులోని ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రోడ్డు రద్దు కోసం ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకున్నారు.ఈ మేరకు గురువారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవల్పమెంట్ విభాగపు ముఖ్యకార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. వడమాలపేట మండలం, పాదిరేడు అరణ్యం గ్రామంలోని 417.16 ఎకరాల వ్యవసాయ భూమిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. అయితే వ్యవసాయ భూమి నుంచి రెసిడెన్షియల్గా వర్గీకరణ జరగలేదు. ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దాదాపు రూ.5.5కోట్లు తుడాకు టీటీడీ చెల్లించింది. దీంతో రెసిడెన్షియల్గా మార్పు చేయడంతో పాటు సదరు స్థలంలో 60 మీటర్ల తుడా ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రోడ్డును కూడా రద్దుచేస్తూ శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు.దీనితర్వాత మళ్లీ లే అవుట్ అప్రూవల్ తీసుకోవాల్సివుంది.సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రైవేట్ సంస్థలకు అన్ని అనుమతులూ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. మరి అనుమతులు లేకుండా టీటీడీ ఉద్యోగులకు జరుగుతున్న రిజిస్ర్టేషన్లు ఎంతవరకు చెల్లుబాటవుతాయన్న ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది.