కన్నులపండువగా పార్వేట ఉత్సవం
ABN , Publish Date - Jan 17 , 2024 | 02:11 AM
తిరుమలలో పార్వేటఉత్సవం కన్నులపండువగా జరిగింది.
![కన్నులపండువగా పార్వేట ఉత్సవం](https://media.andhrajyothy.com/media/2023/20231205/gg_fc295d8edc.jpg)
తిరుమల, జనవరి16(ఆంధ్రజ్యోతి): తిరుమలలో పార్వేటఉత్సవం కన్నులపండువగా జరిగింది.మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మలయప్పస్వామి తిరుచ్చిలో పార్వేటమండపానికి వేంచేశారు. స్వామి వెంట మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామి కొలువుదీరారు.ఉభయదారులకు, తాళ్లపాక వంశీయులకు, మఠంవారికి మర్యాదలు చేశాక శ్రీకృష్ణస్వామిని సన్నిధి యాదవ పూజ చేసిన ప్రదేశానికి వేంచేపు చేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు.మలయప్పస్వామి సహా అర్చకులు ముందుకు కొంతదూరం పరుగెత్తి బడిసెను విసిరి వెనక్కు వచ్చారు. ఇలా మూడుసార్లు జరిగింది. మలయప్పస్వామి తిరిగి ఆలయ మహద్వారం వద్దకు చేరుకుని హథీరాంజీ మఠంవారి బెత్తాన్ని తీసుకుని సన్నిధిలోకి వేంచేశారు.టీటీడీ చైర్మన్ కరుణాకర రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.