టాయిలెట్లనూ వదలని కక్కుర్తి
ABN , Publish Date - Apr 24 , 2024 | 02:07 AM
తిరుపతిలో కొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధుల తీరు చూసి నగర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజల అవసరార్థం ఆర్టీసీ బస్టాండుకు ఉత్తరాన యూజ్ అండ్ పే టాయిలెట్ నిర్మించేందుకు విజయవాడకు చెందిన రవీంద్రనాథ్ స్వచ్ఛంద సేవా సంఘం ముందుకొచ్చింది.
- రెండు వైపులా దుకాణాల ఏర్పాటు
- రోజూ రూ.3వేలు ప్రజాప్రతినిధి జేబులోకి
తిరుపతి(కొర్లగుంట), ఏప్రిల్ 21: తిరుపతిలో కొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధుల తీరు చూసి నగర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజల అవసరార్థం ఆర్టీసీ బస్టాండుకు ఉత్తరాన యూజ్ అండ్ పే టాయిలెట్ నిర్మించేందుకు విజయవాడకు చెందిన రవీంద్రనాథ్ స్వచ్ఛంద సేవా సంఘం ముందుకొచ్చింది. నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారం దాదాపు రూ.20లక్షలతో అధునాతన సౌకర్యాలతో కూడిన మరుగుదొడ్ల కేంద్రం నిర్మించింది. అయితే ఈ నిర్మాణం తుది దశలో ఉన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. నిర్మాణం పూర్తయి, సజావుగా ప్రారంభం కావాలంటే మరుగుదొడ్ల కేంద్రానికి ఇరువైపులా పది అడుగులు విస్తరించి, ప్లాట్ఫామ్స్ రెడీ చేసివ్వాలని హుకుం జారీ చేశారు. చేసేదేమీలేక నిర్మాణదారులు సొంత ఖర్చుతో ప్లాట్ఫామ్స్ సిద్ధం చేశాకే ప్రారంభం సజావుగా సాగింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ ప్రజాప్రతినిధి తన అనుచరులతో అనధికారంగా తోపుడుబండిపై దుకాణాలు పెట్టించారు. ఓవైపు కూల్డ్రింక్స్, వాటర్ బాటిల్స్, బీడీ, సిగరెట్, స్నాక్స్, పాన్పరాక్స్ వంటి 24గంటల చిల్లర వ్యాపార దుకాణం ఓ వ్యాపారికి, మరోవైపు టిఫిన్ సెంటర్ను ఉదయం, సాయంత్రం వేర్వేరుగా ఇద్దరు వ్యాపారులకు అప్పగించారు.ఒక్కో వ్యాపారి నుంచి రోజుకు రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.3వేలను వసూలు చేసుకుంటున్నట్లు తెలిసింది.