Share News

చిత్తూరు ఎస్పీగా జాషువా

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:49 AM

సాధారణ ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త ఎస్పీగా జాషువా రానున్నారు.

చిత్తూరు ఎస్పీగా జాషువా
జాషువా

ఫ కౌంటర్‌ ఇంటెలిజెన్సు సెల్‌ ఎస్పీగా రిషాంత్‌రెడ్డి.. తిరుపతి టాస్క్‌ఫోర్సుకు అదనపు బాధ్యతలు

చిత్తూరు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సాధారణ ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త ఎస్పీగా జాషువా రానున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాల పునర్విభజన తర్వాత చిత్తూరు ఎస్పీగా రిషాంత్‌రెడ్డి 2022 ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టారు. సుమారు 22 నెలల పాటు పనిచేసిన ఆయన.. అంతకుముందు ఎస్‌ఈబీ ఏఎస్పీగా కూడా పనిచేశారు. జూన్‌ ఒకటో తేదికి రిషాంత్‌రెడ్డి ఎస్పీగా, ఏఎస్పీగా మూడేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆయనకు బదిలీ తప్పలేదు. కౌంటర్‌ ఇంటెలిజెన్సు (సీఐ) విభాగ ఎస్పీగా రెగ్యులర్‌గా, తిరుపతి ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా అదనపు బాధ్యతల్ని ఈయనకు ప్రభుత్వం అప్పగించింది.

నాడు పలమనేరు డీఎస్పీ.. నేడు ఎస్పీ

ప్రస్తుతం కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న జాషువా జిల్లాకు బదిలీ అయ్యారు. 2009 గ్రూప్‌-1 బ్యాచ్‌కు చెందిన ఈయన 2016 బ్యాచ్‌ ఐపీఎ్‌సగా పరిగణించబడుతున్నారు. తిరుపతి ఎస్పీ సరమేశ్వర్‌రెడ్డి, ఈయన ఒకే గ్రూప్‌-1 బ్యాచ్‌ అధికారులు. 2012-13 మధ్యకాలంలో జాషువా పలమనేరు డీఎస్పీగా పనిచేశారు. తల్లిదండ్రులది విజయవాడ అయినప్పటికీ, ఆయన పుట్టి పెరిగిందంతా హైదరాబాదులోనే.

పలు వివాదాల్లో రిషాంత్‌రెడ్డి

బదిలీ అయిన ఎస్పీ రిషాంత్‌రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి బలంగా ఎదుర్కొన్నారు. గతేడాది జనవరి 4వ తేదీన చంద్రబాబు కుప్పంలో పర్యటించకుండా ప్రభుత్వ జీవో 1 పేరుతో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ప్రచార రథం సీజ్‌ చేయడంతో పాటు సభలు ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడంతో నియోజకవర్గమంతా రథం లేకుండానే మాట్లాడారు. రోడ్లపై కింద కూర్చొని నిరసన తెలిపారు. అలాగే, లోకేశ్‌ యువగళం పాదయాత్రను జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభించగా అనుమతులు ఇవ్వడంలో ఇబ్బందులు పెట్టారు. పాదయాత్ర సాగినన్ని రోజులూ నిత్యం కేసులు పెడుతూ పోలీసులు అడ్డుపడ్డారు. గతేడాది ఆగస్టులో చంద్రబాబు పుంగనూరులో పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవడం, టీడీపీ శ్రేణులు తిరగబడటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో పుంగనూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు సుమారు 600 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపించారు. కుప్పం నియోజకవర్గంలోనూ మహిళా నేతలు సహా అత్యధికంగా నేతలు, కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వీటన్నింటికీ ఎస్పీ రిషాంత్‌రెడ్డినే కారణమని టీడీపీ నాయకులు అనేకమార్లు అరోపించారు. లోకేశ్‌ అయితే జిల్లా దాటిన తర్వాత కూడా ఎస్పీ రిషాంత్‌రెడ్డి గురించి పలుమార్లు వ్యతిరేకంగా మాట్లాడారు.

Updated Date - Jan 30 , 2024 | 01:49 AM