అంతరాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ల దొంగల అరెస్టు
ABN , Publish Date - Jan 14 , 2024 | 12:15 AM
అంతర్రాష్ట ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8.26 లక్షల విలువైన రాగి వైర్లు, మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు.
![అంతరాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ల దొంగల అరెస్టు](https://media.andhrajyothy.com/media/2023/20231205/13ctr14_FF_60fd7af273.jpg)
రూ. 8 లక్షల విలువైన రాగి వైర్లు,
3 ద్విచక్ర వాహనాల స్వాధీనం
చిత్తూరు, జనవరి 13: అంతర్రాష్ట ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8.26 లక్షల విలువైన రాగి వైర్లు, మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను చిత్తూరు తాలూకా సీఐ గంగిరెడ్డి పోలీ్సస్టేషన్ వద్ద మీడియాకు తెలిపారు. కొంతకాలంగా జిల్లాలోని పలు మండలాల్లో వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్వైర్లను ఎత్తుకెళుతున్నారు. వారం కిందట ఇటువంటి కేసు ఎన్ఆర్పేట పోలీసుస్టేషన్లోనూ నమోదైంది. విచారణలో దొంగల గురించి కచ్చితమైన సమాచారం అందింది. తాలూకా ఎస్ఐ ఉమామహేశ్వర్రెడ్డి, ఎన్ఆర్పేట ఎస్ఐ కేవీ సుబ్బమ్మ, జీడీ నెల్లూరు ఎస్ఐ రామాంజినేయులు, ఈస్టు సర్కిల్ సిబ్బంది రాజ్కుమార్, సుధాకర్ కలిసి ఈ దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచారు. శనివారం ఉదయం ఆరు గంటలకు చిత్తూరు రూరల్ మండలం చిత్తూరు-తిరుత్తణి రోడ్డులోని కుర్చివేడు క్రాస్ వద్ద పాలసముద్రం మండలం కన్నికాపురం దళితవాడకు చెందిన దినేష్(22), వీఆర్కుప్పంకు చెందిన ఆదిత్య(19), ఆర్. దినేష్(22), ప్రవీణ్కుమార్(23), ఆలీ అబ్బాస్(25), వేలూరు జిల్లా వాలాజాకు చెందిన సూరి ఏళుమలై (23)లను పట్టుకున్నారు. విచారణలో జిల్లాతోపాటు తమిళనాడులోనూ వీరు చోరీలకు పాల్పడినట్లు తేలింది. అనంతరం వారి వద్ద నుంచి రూ.8.26 లక్షల విలువైన 757 కిలోల కాపర్వైర్లు, 250 మీటర్ల కరెంటు కేబుల్వైర్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు నగదు రివార్డులిచ్చి అభినందించారు.