ఘనంగా కుంభాభిషేక మహోత్సవాలు
ABN , Publish Date - Feb 15 , 2024 | 12:30 AM
పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు మూడో రోజైన బుధవారం ఘనంగా జరిగాయి.
![ఘనంగా కుంభాభిషేక మహోత్సవాలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/14ctr_ptp2_FF_d87a1e3b6f.jpg)
పూతలపట్టు, ఫిబ్రవరి 14: పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు మూడో రోజైన బుధవారం ఘనంగా జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గ్రామంతో పాటు ఆలయాల చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్దీపాలంకరణ పలువురిని ఆకట్టుకుంటోంది. బుధవారం వేకువజామున గణపతి వేణుగోపాలస్వామి విగ్రహాలకు పూజలు నిర్వహించారు. బ్రహ్మముహూర్త సమయంలో మహాగణపతి స్వామివారి మూషిక వాహనం విగ్రహ స్థాపన జరిగింది. ఉదయం 8 గంటల నుంచి జరిగిన వేదస్వస్తి ప్రతిష్ఠమూర్తులకు శ్రీరామ సహస్రనామ హవనం, ఆంజనేయ సహస్ర హోమాలు, దర్బారు సేవ, చతుర్వేదస్వస్తి తదితర పూజా కార్యక్రమాల్లో గల్లా రామచంద్రనాయుడు, అరుణకుమారి, జయదేవ్ పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటలకు నిర్వహించిన పండరి భజనలు, కోలాటాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు యువరాజులు నాయుడు, చిత్తూరు పార్లమెంటు అధికార ప్రతినిధి గంగారపు గోపి, మండల కన్వీనర్ దొరబాబు చౌదరి, మాజీ కన్వీనర్ చంద్రమౌలి, నాయకులు చింతగుంపల రజినీ, బీసీ నాయకులు షణ్ముగం, గల్లా కుటుంబసభ్యులతో పాటు ట్రస్టు సభ్యులు గల్లా రామానాయుడు, భానుమూర్తి నాయుడు, స్థానికులు పాల్గొన్నారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి విగ్రహప్రతిష్ఠ, అనంతరం సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనున్నాయి.