సహకార సంఘాల ఉద్యోగులకు శుభవార్త
ABN , Publish Date - May 26 , 2024 | 02:00 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సహకార వ్యవసాయ పరపతి సంఘాల (సింగిల్ విండోల) ఉద్యోగులకు భారీ ఊరట లభించింది.
రిటైర్మెంటు వయస్సు 62ఏళ్లకు
పెంచాలని హైకోర్టు ఉత్తర్వులు
చిత్తూరు కలెక్టరేట్, మే 25: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సహకార వ్యవసాయ పరపతి సంఘాల (సింగిల్ విండోల) ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలు చేయాలని హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పుతో 76 సహకార సంఘాల్లో పనిచేస్తున్న 200మంది ఉద్యోగులకు మేలు చేకూరనుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. అయితే దీన్ని సహకార సంఘాలకు, సహకార సంస్థలకు వర్తింపజేయలేదు.దీంతో సహకార శాఖ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఉత్తర్వులు రావడంతో వీరు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. ఈసారి వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 60 ఏళ్ల రిటైర్మెంట్కు ముందుగా హైకోర్టులో కేసులు వేసిన ఉద్యోగులకు అరియర్స్ చెల్లించాలని, పాలకవర్గాల మహాజన సభల తీర్మానం మేరకు ఆయా సంఘాల పరిధిలోని ఉద్యోగులకు వయోపరిమితి అమలు చేయాలని హైకోర్టు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం 60 ఏళ్లకే రిటైర్ అయిన ఉద్యోగులు తొమ్మిది మంది ఉండగా, దగ్గరగా మరో 15 మంది ఉన్నారు.