Share News

లింగ సమానత్వంతోనే దేశానికి విశ్వ గురుస్థానం

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:05 AM

పద్మావతి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

లింగ సమానత్వంతోనే దేశానికి విశ్వ గురుస్థానం
గవర్నర్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ అందుకుంటున్న పి. సుశీల

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 7: లింగ సమానత్వం సాధించడం ద్వారానే మన దేశం విశ్వ గురువుగా నిలవడానికి అవకాశం కలుగుతుందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు.ఛాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ లింగ సమానత్వమనేది మహిళా సాధికారతకు సంబంధించిన అంశం మాత్రమే కాదనీ, ఇది దేశాభివృద్ధితోనూ ముడిపడి ఉన్న విషయమని చెప్పారు. లింగ సమానత్వపు అంతిమ లక్ష్యం స్త్రీ, పురుషులు సమాన హక్కులు పొందడమే అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి పద్మావతి యూనివర్సిటీ దోహదం చేస్తోందని కితాబిచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన ఇస్రో రిటైర్డు శాస్త్రవేత్త మంగళ మణి మాట్లాడుతూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా తాము ఎంచుకున్న రంగంలో రాణించే అవకాశం మహిళలకు ఉంటుందన్నారు.తాను టెక్నాలజీ వైపు ఆసక్తి పెంచుకోవడానికీ, ఇస్రో శాస్త్రవేత్తగా రాణించడానికీ తల్లిదండ్రుల ప్రోత్సాహం, దేవుడి దయతో పాటు ఆత్మ స్థైర్యం చాలా ఉపయోగపడిందన్నారు.అంటార్కిటిక్‌ ఎక్స్‌పెడిషన్‌ కోసం 400 రోజుల ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు.ఓ మహిళగా ఈ సమస్యలన్నింటినీ ఆత్మ స్థైర్యంతోనే పరిష్కరించుకున్నా నన్నారు.వీసీ ప్రొఫెసర్‌ భారతి, మాట్లాడుతూ పి.సుశీల వంటి అద్వితీయమైన గాయనికి గౌరవ డాక్టరేట్‌ అందించడం మహిళా యూనివర్సిటీకి గర్వకారణమన్నారు. ఈ తరం విద్యార్థినులు సుశీల చేసిన కృషి నుంచీ స్ఫూర్తి పొందాలని సూచించారు. మహిళాభివృద్ధిలో నాలుగు దశాబ్దాలుగా తన వంతు కృషి చేస్తున్న పద్మావతి వర్శిటీ జాతీయ, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలతో ఒప్పందాలు చేసుకొని బోధన, పరిశోధనల్లో పరస్పరం సహకరించుకుంటున్నట్టు తెలిపారు.అనంతరం ప్రముఖ గాయని పి. సుశీలకు గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రదానం చేశారు. గౌరవ డాక్టరేట్‌, ధృవీకరణ పత్రం, జ్ఞాపికతో సుశీలను సత్కరించారు. ప్రతిభ కనభరిచిన 57 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. సైన్స్‌ విద్యార్థినులు 30మంది, ఆర్ట్స్‌ విద్యార్థినులు 21మంది, ఇంజనీరింగ్‌ విద్యార్థినులు ఆరుగురు బంగారు పతకాలు స్వీకరించగా 12 మంది ఆర్ట్స్‌, సైన్స్‌ విద్యార్థులు పుస్తక బహుమతులు అందుకున్నారు. నలుగురు ఆర్ట్స్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థులు నగదు బహుమతులు పొందారు.పీహెచ్‌డీలు 86మందికి, ఇద్దరికి ఎంఫిల్‌, పీజీ పట్టాలు 771మందికి, డిగ్రీ పట్టాలు 872మందికి, దూరవిద్యకు సంబంధించిన డిగ్రీలు 72మందికి, పీజీ పట్టాలు 50 మందికి అందజేశారు.

Updated Date - Mar 08 , 2024 | 01:05 AM