Share News

ధాన్యం ధరల పతనం

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:09 AM

ఈ ఏడాది మొదట్లో ఆశాజనకంగా వుండిన ధాన్యం ధరలు బ్రోకర్ల సిండికేట్‌ దెబ్బతో పతనమయ్యాయి. రెండు నెలల వ్యవధిలో ధాన్యం బ్రోకర్లు సిండికేట్‌గా మారి బయటి రాష్ట్రాల్లో ధరలు బాగున్నప్పటికీ మిల్లర్లు ధాన్యాన్ని అడగడం లేదంటూ చేతులెత్తేశారు. ధాన్యం ధరలు పడిపోయాయని ప్రచారం సాగించారు

ధాన్యం ధరల పతనం

కోట, ఏప్రిల్‌ 18: ఈ ఏడాది మొదట్లో ఆశాజనకంగా వుండిన ధాన్యం ధరలు బ్రోకర్ల సిండికేట్‌ దెబ్బతో పతనమయ్యాయి. రెండు నెలల వ్యవధిలో ధాన్యం బ్రోకర్లు సిండికేట్‌గా మారి బయటి రాష్ట్రాల్లో ధరలు బాగున్నప్పటికీ మిల్లర్లు ధాన్యాన్ని అడగడం లేదంటూ చేతులెత్తేశారు. ధాన్యం ధరలు పడిపోయాయని ప్రచారం సాగించారు.సముద్రతీర ప్రాంత మండలాలైన కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో రైతులు ఎక్కువభాగం బీపీటీ 5204 (పెద్దజిలకర), నెల్లూరు జిలకర్లు, 1010 ధాన్యాన్ని సాగు చేస్తున్నారు.కోతలు చివరి దశకు చేరుకోవడంతో పాటు దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో ఆనందంగా వున్న రైతులు ధాన్యం ధరలు పడిపోయాయంటూ ప్రచారం ఊపందుకోవడంతో హతాశులయ్యారు.మొదట్లో రూ.23,500 పలికిన బీపీటీ 5204 రకం ప్రస్తుతం రూ.21 వేలకు పడిపోయింది. ఆ రేటుకు కూడా ధాన్యం అడిగే నాథుడేలేడని బ్రోకర్లు ప్రచారం చేస్తున్నారు.మొన్నటి వరకు నెల్లూరు జిలకర్లు రూ.17వేలకు పైగా పుట్టి ధాన్యం పలుకుతుండగా, ప్రస్తుతం రూ.15వేలు మాత్రమే ఇస్తామంటున్నారు.1010 రకం ధాన్యం పుట్టి రూ.17,200 పలుకుతుండగా ప్రస్తుతం రూ.15వేలకు కూడా అడిగే నాఽథుడే లేకుండా పోయారని రైతులు వాపోతున్నారు. చెన్నైలోని రెడ్‌హిల్స్‌, కర్ణాటకలోని తుంకూరు ప్రాంతాల్లో ధాన్యానికి మంచి ధర వున్నప్పటికీ రైతుల వద్ద ధాన్యం నిల్వలను ఆసరాగా చేసుకొని బ్రోకర్లు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించేశారు. కోట, చిట్టమూరు మండలాల్లో ధాన్యం కోతలు జరుగుతూనే ఉండగా కొన్ని గ్రామాల్లో రైతుల వద్ద ధాన్యం నిల్వలున్నాయి. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు చేసేదిలేక నిల్వ ఉన్న ధాన్యాన్ని అందినకాడికి విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది దిగుబడులు బాగుండడం...మంచి ధరలు పలకడం చూసి ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 01:09 AM