చిత్తూరుకు చేరిన డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులు
ABN , Publish Date - Jan 08 , 2024 | 01:02 AM
ఓటర్లకు పంపిణీ చేసేందుకు కొత్త డిజిటల్ ఎపిక్ (ఓటరు) గుర్తింపు కార్డులు రెండ్రోజుల క్రితం జిల్లా కేంద్రానికి చేరాయు.
![చిత్తూరుకు చేరిన డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులు](https://media.andhrajyothy.com/media/2023/20231205/7ctr62_FF_56d282eff3.jpg)
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 7: ఓటర్లకు పంపిణీ చేసేందుకు కొత్త డిజిటల్ ఎపిక్ (ఓటరు) గుర్తింపు కార్డులు రెండ్రోజుల క్రితం జిల్లా కేంద్రానికి చేరాయు. నాలుగో విడతగా 80వేల ఎపిక్ కార్డులను ఎన్నికల సంఘం పంపింది. మూడు విడతల్లో ఇదివరకు 79వేల కార్డులు అందాయి. కలెక్టరేట్లోని జిల్లా ఎన్నికల విభాగానికి అందిన ఎపిక్ కార్డుల స్కానింగ్ ప్రక్రియను ఐదుగురు రెవెన్యూ సిబ్బంది చేపడుతున్నారు. మరోవైపు తపాలాశాఖ సిబ్బంది స్కానింగ్ చేపట్టారు. వీటిని తపాలాశాఖ ద్వారా రిజిష్టర్ పోస్టులో ఓటర్ల ఇళ్లకే పంపిస్తామని డీఆర్వో రాజశేఖర్ తెలిపారు. ఒకవేళ పోస్టల్ చిరునామా తప్పుగా వుంటే వాటిని సచివాలయ వలంటీర్ ద్వారా ఓటరుకు అందజేస్తామన్నారు. గతంలో పాత ఓటరు గుర్తింపుకార్డులపై 14 అంకెల సంఖ్య ఉండేది. ఇప్పుడు జారీ అవుతున్న కొత్త ఎపిక్ కార్డుల్లో 10 అంకెలు (తొలి మూడు ఆంగ్ల అక్షరాలు, మిగిలిన ఏడు అంకెలు) ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రత్యేకంగా మూడు ఆంగ్ల అక్షరాలు, ప్రత్యేక సిరీస్ ఉంటుంది.