ధాన్యంలో దళారుల దందా
ABN , Publish Date - Aug 12 , 2024 | 01:38 AM
కల్తీ కాకుండా ఏదీ లభించే పరిస్థితి కనిపించడం లేదు. నాణ్యత కోసం వెతుకులాడుకునే పరిస్థితి వచ్చేసింది. చివరికి తినే అన్నం సైతం కల్తీ చేస్తున్నారు. ఆపై మధ్య తరగతి జనాలే లక్ష్యంగా దళారులు మోసం చేస్తున్నారు.
‘బీపీటీ’ రకంలో ‘ఎన్ఎల్ఆర్’తో కల్తీ
మధ్య తరగతే లక్ష్యంగా మోసం
కల్తీ కాకుండా ఏదీ లభించే పరిస్థితి కనిపించడం లేదు. నాణ్యత కోసం వెతుకులాడుకునే పరిస్థితి వచ్చేసింది. చివరికి తినే అన్నం సైతం కల్తీ చేస్తున్నారు. ఆపై మధ్య తరగతి జనాలే లక్ష్యంగా దళారులు మోసం చేస్తున్నారు.
- పెళ్లకూరు/తడ
ఒకప్పుడు నెల్లూరు మొలగొలుకులు ఫేమస్. ఆరు నెలల పాటు రైతు శ్రమించి దిగుబడి చేసే ధాన్యం రకమది. దీనిపై అన్నివర్గాల వారు మక్కువ చూపేవారు. తర్వాత సన్నరకాలకు గిరాకి వచ్చింది. అందులో ముఖ్యమైంది బీపీటీ 5224 (బాపట్ల జిలకర) ధాన్యం. ఈ పంట కేవలం 90 రోజుల నుంచి వంద రోజుల్లోపు రైతు చేతికి వస్తుంది. తినేందుకు తియ్యగా.. తృప్తిగా అనిపించే రకం ధాన్యం. ప్రస్తుతం ఈ రకం ధాన్యం ధర పుట్టి రూ.26,450. ఈ రకానికి మార్కెట్లో గిరాకి ఏర్పడింది. ఇటీవల బీపీటీలను పోలిన ఎన్ఎల్ఆర్ 3449 (నెల్లూరు జిలకర) రకం ధాన్యం అందుబాటులోకి వచ్చింది. ఈ ధాన్యం 80 రోజుల్లోనే చేతికొస్తుంది. పైగా ఎటువంటి తెగుళ్లకు ఆస్కారం లేకుండా రైతు ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుంది. నాణ్యత అంతంత మాత్రమే. రుచి ఉండక పోవడంతో ఎవరూ ఇష్టపడడం లేదు. ధరల్లో సైతం భారీ వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఎల్ఆర్ 5224 పుట్టి ధర రూ.14,950గా ఉంది. అంటే బీపీటీ రకాలకు, ఎన్ఎల్ఆర్ 5224 రకం ధాన్యానికి మధ్య వ్యత్యాసం సుమారు రూ.11,500గా ఉంది. ఇదే దళారులకు, మిల్లర్లకు అవకాశంగా మారింది.
వ్యత్యాసం గుర్తించడం కష్టం
బీపీటీ, ఎన్ఎల్ఆర్ రకాలు చూసేందుకు ఒకేలా ఉంటాయి. రైతులకు, మిల్లర్లకు తప్ప అందులో వ్యత్యాసం గుర్తించడం కష్టం. దీనికితోడు ఈ రెండు రకాల ధాన్యాలను ఆడించి బియ్యం చేస్తే ఇక ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇదే దళారులకు అనుకూలమైంది. రైతుల నుంచి రెండు రకాల ధాన్యాలను కొనుగోలు చేసే దళారులు, మిల్లర్లు కొన్ని ప్రదేశాల్లో ఈ రెండు రకాల ధాన్యాలను కలబోస్తారు. మూడు వంతుల బీజీటీ రకం ధాన్యంలో ఓ వంతు ఎన్ఎల్ఆర్ రకాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్నారు. తద్వారా ఎన్ఎల్ఆర్ రకానికి కూడా బీపీటీ ధాన్యం ధరనే దళారులు వసూలు చేస్తున్నారు. ఈ దందా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సూళ్లూరుపేట, దొరవారిసత్రం, పెళ్లకూరు మండలాల్లో భారీ ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి.