తిరుచానూరు ఆలయంలో క్యూకాంప్లెక్సు పనుల ప్రారంభం
ABN , Publish Date - Mar 22 , 2024 | 02:32 AM
శ్రీవారి దేవేరి పద్మావతీ దేవి కొలువైన తిరుచానూరులో అత్యాధునిక క్యూకాంప్లెక్సు పనులు మొదలయ్యాయి.
![తిరుచానూరు ఆలయంలో క్యూకాంప్లెక్సు పనుల ప్రారంభం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తిరుచానూరు, మార్చి 21 : శ్రీవారి దేవేరి పద్మావతీ దేవి కొలువైన తిరుచానూరులో అత్యాధునిక క్యూకాంప్లెక్సు పనులు మొదలయ్యాయి.భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో గత యేడాది ఆగస్టులో టీడీపీ పాలకమండలి రూ.23కోట్ల వ్యయంతో తిరుమల తరహాలో అత్యాధునిక క్యూకాంప్లెక్సు నిర్మాణానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.గత నెల క్యూకాంప్లెక్సు టెండర్ను దక్కించుకున్న కంపెనీ పనులు ప్రారంభించింది. పాత డిప్యూటీ ఈవో కార్యాలయ భవన సముదాయంలో ఈ క్యూకాంప్లెక్సును నిర్మించనున్నారు. ఇందులో భాగంగా మూడు రోజులుగా 0.75ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత డిప్యూటీ ఈవో కార్యాలయం, కల్యాణమండపం సముదాయాన్ని తొలగిస్తున్నారు.క్యూకాంప్లెక్సు నిర్మాణానికి సుమారు ఏడాదికి పైగా పడుతుందని టీటీడీ ఇంజనీరింగ్శాఖ అధికారులు తెలిపారు. తిరుమల తరహాలో క్యూకాంప్లెక్సులో ప్రవేశించిన భక్తులు అన్ని సేవలూ అక్కడే పొంది ప్రత్యేక క్యూలైను ద్వారా అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేలా క్యూకాంప్లెక్సు నిర్మాణం జరుగుతుందని తెలిపారు.మూడంతస్తులతో క్యూకాంప్లెక్సు నిర్మాణం జరగనుంది. సెల్లార్లో లాకర్లు, సెల్ఫోన్, పాదరక్షల కౌంటర్లు, ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టికెట్ కౌంటర్లు, సెక్యూరిటీ పాయింట్ వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో వెయిటింగ్ హాల్, కల్యాణకట్ట రానున్నాయి. ఇంకో అంతస్తులో క్యూలైన్, వెయిటింగ్ హాల్ వస్తాయి.నాల్గవ గేట్ వద్ద నిర్మించనున్న ఈ క్యూకాంప్లెక్సులోకి భక్తులు ప్రవేశించిన తరువాత లగేజీలను అక్కడే భద్రపరచుకుని ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి వెళతారు. ఇక తిరుమల మాడ వీధుల్లో ఉండే మూవింగ్ బ్రిడ్జి తరహాలో కదిలే వంతెనను కూడా పాత పోలీ్సస్టేషన్ వద్ద నిర్మించనున్నారు. అమ్మవారి ఉత్సవాల సమయంలో వాహనసేవలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు నూతన క్యూకాంప్లెక్సు నుంచి కదిలే వంతెన ద్వారా పుష్కరిణి పక్కనే ఏర్పాటు చేయనున్న క్యూలైను ద్వారా ఆలయం వెలుపల ఉన్న ప్రాకారం గుండా ఇపుడున్న క్యూలైన్లోకి ప్రవేశించనున్నారు.