Share News

సూళ్ళూరుపేటలో కిలివేటికి లైన్‌ క్లియర్‌ !

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:25 AM

సూళ్లూరుపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ విషయమై వైసీపీ అధిష్ఠానం లైన్‌ క్లియర్‌ చేసినట్టు సమాచారం.

సూళ్ళూరుపేటలో కిలివేటికి లైన్‌ క్లియర్‌ !
కిలివేటి సంజీవయ్య

తడ, జనవరి 11: సూళ్లూరుపేట సిట్టింగ్‌ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ విషయమై వైసీపీ అధిష్ఠానం లైన్‌ క్లియర్‌ చేసినట్టు సమాచారం. ఈ మేరకు గురువారం ఆయన నియోజకవర్గవ్యాప్తంగా అనుచరులతో కలసి తాడేపల్లి వెళ్ళి అధినేత జగన్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపినట్టు సమాచారం.అయితే పార్టీ అధికారికంగా దీనిపై ప్రకటన చేయలేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనుకూల, వ్యతిరేక వర్గాలుగా వైసీపీ చీలిపోయి పోటాపోటీ కార్యకలాపాలు సాగించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యతిరేక వర్గం పలు దఫాలు సీఎం జగన్‌ను కలసి కిలివేటికి మళ్ళీ టికెట్‌ ఇవ్వవద్దని కోరిన విషయం తెలియంది కాదు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ రెండు వర్గాలను సమన్వయ పరిచే సయంలోనూ కిలివేటి మాకొద్దంటూ ఆయన ఎదుటే నిరసన గళాన్ని వినిపించారు. ఇటీవల గూడూరులో విజయసాయిరెడ్డిని అడ్డుకున్న కిలివేటి వర్గం ఆయనకే టికెట్‌ ఇవ్వాలని నినాదాలు చేసింది.ఏడాదిగా సాగుతున్న ఈ పరిణామాలతో టికెట్‌ కొత్త వ్యక్తికి ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే నియోజకవర్గంలోని కొందరు సీనియర్‌ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించి మళ్లీ కిలివేటికే టికెట్‌ ఇచ్చేందుకు అధిష్ఠానం అంగీకరించినట్టు తెలిసింది. దీంతో అధినేతను కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకు కిలివేటి తన అనుచరవర్గంతో కలసి గురువారం తాడేపల్లి వెళ్ళారు. అక్కడ సీఎంను కలిశారు. ఈ మేరకు అక్కడ నుంచీ ఎమ్మెల్యే అనుచరులు ఫొటోలు, సమాచారం సామాజిక మాధ్యమాలకు విడుదల చేయడంతో నియోజకవర్గంలో అవి వైరల్‌ అవుతున్నాయి. దానికి తోడు గురువారం రాత్రి పార్టీ విడుదల చేసిన మూడవ జాబితాలో గూడూరు, సత్యవేడు, పూతలపట్టు, తిరుపతి ఎంపీ తదితర నాలుగు ఎస్సీ రిజర్వుడు స్థానాలలో కొత్త వారిని ఇంఛార్జులుగా నియమించడం, అందులో సూళ్ళూరుపేట ప్రస్తావన లేకపోవడంతో దాదాపుగా కిలివేటికి లైన్‌ క్లియర్‌ అయినట్టుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Updated Date - Jan 12 , 2024 | 12:26 AM