నగరిలో చిరుత సంచారం
ABN , Publish Date - Jan 14 , 2024 | 12:20 AM
ఐరాలకు కూతవేటు దూరంలోని నగరిలో శనివారం వేకువ జామున రెండు లేగదూడలను చిరుత పులి చంపేసింది.
రెండు లేగదూడలను చంపేసింది
ఐరాల, జనవరి 13: ఐరాలకు కూతవేటు దూరంలోని నగరిలో శనివారం వేకువ జామున రెండు లేగదూడలను చిరుత పులి చంపేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఐరాల మండలంలోని ఈడిగపల్లెకు చెందిన రెడ్డెప్ప తన పశువులను శుక్రవారం రాత్రి నగరిలోని తన మామిడి తోటలో కట్టేశాడు. శనివారం వేకువ జామున తోటలోకి చొరబడ్డ చిరుతపులి అక్కడ కట్టి ఉన్న రెండు లేగ దూడలను చంపేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ రేంజ్ అధికారి బాలకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి, పరిశీలించారు. గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించవద్దని, అడవిలో క్రూర జంతువులు కూడా ఉన్నాయని హెచ్చరించారు. అలాగే పశువులను మేతకోసం అడవిలోకి తీసుకెళ్లొద్దని చెప్పారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించారు. కాగా.. ఇటీవల నగరికి సమీపంలోని తోకబండ వద్ద ఓ ఆవును చిరుత చంపేసిన విషయం తెలిసిందే.