వేడుకగా శ్రీరామనవమి
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:56 AM
శ్రీరామనవమి వేడుకలు బుధవారం జిల్లావ్యాప్తంగా వేడుకగా జరిగాయి.
తిరుమల, ఏప్రిల్17(ఆంధ్రజ్యోతి):శ్రీరామనవమి వేడుకలు బుధవారం జిల్లావ్యాప్తంగా వేడుకగా జరిగాయి. రామాలయాల్లో భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నవమి వేడుకలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు.ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాలసేవ, అర్చన సేవలను నిర్వహించారు.9 నుంచి 11 గంటల వరకు సీతారామలక్ష్మణ సమేత హనుమంత స్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలను, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు.సాయంత్రం 6.30 గంటలకు వాహనమండపంలో భక్తుడైన హనుమంతుడిపై శ్రీరామచంద్ర మూర్తిని కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు.టీటీడీ ఈవో ధర్మారెడ్డి, పేష్కార్ శ్రీహరి, డిప్యూటీఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య బంగారు వాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు.తిరుపతిలోని కోదండరామాలయంలోనూ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.రాత్రి శ్రీరాముడు తన భక్తుడైన హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించారు.