హైవే విస్తరణకు బ్లాస్టింగ్
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:26 AM
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కొండను పేల్చడానికి అధికారులు పేల్చారు. ఈ పేలుడు ధాటికి రాళ్లు వచ్చి పైన పబడటంతో బిహారుకు చెందిన యువకుడు మృతిచెందారు.
రాయిపడి బిహారు యువకుడి దుర్మరణం
పేలుళ్లలో జాగ్రత్తగా ఉండటంలేదంటూ స్థానికుల విమర్శ
గుడిపాల, జనవరి 17: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కొండను పేల్చడానికి అధికారులు పేల్చారు. ఈ పేలుడు ధాటికి రాళ్లు వచ్చి పైన పబడటంతో బిహారుకు చెందిన యువకుడు మృతిచెందారు. గుడిపాల మండలంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు- వేలూరు, వేలూరు- చిత్తూరు జాతీయ రహదారిలోని మోపతికన్నికాపురం, అరుళ్పురం సమీపంలో ఆరులేన్ల రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా గుట్టను చదునుచేసే ప్రయత్నంలో రాళ్లు పేల్చడానికి బ్లాస్టింగ్ చేశారు. ఈ పేలుడు తీవ్రతకు రాళ్లు ఎగిరి వచ్చి.. రోడ్డుపై అటుగా ఎవరైనా వస్తే ఆపేందుకు ఉన్న బిహారుకు చెందిన కూలీ మొహమ్మద్ ఇర్షాద్ రాజా (23)పై పడ్డాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. పేలుడు పదార్థాలను పెట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో హైవే అధికారులు, కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. మృతదేహాన్ని తహసీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్, పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఫ కాగా, వారం రోజుల కిందట వసంతాపురం పంచాయతీ పశుమంద ఎస్టీ కాలనీలో రోడ్డు వెడల్పులో భాగంగా రాళ్లు పేల్చడానికి సిద్ధంచేయగా, అవి అకస్మాత్తుగా పేలడంలో ఇళ్లపై పడి గోడలు దెబ్బతిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. దీనిపై స్థానికుల ఫిర్యాదుతో హైవే అధికారులను ఎస్ఐ రామ్మోహన్ పిలిపించి.. పేలుడు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే బుధవారం నాటి ఘటన చోటుచేసుకుందన్న విమర్శలు వచ్చాయి.