Share News

కార్పొరేటర్‌పై దుండగుల దాడి

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:27 AM

చిత్తూరు నగరంలోని 42వ డివిజన్‌ వైసీపీ కార్పొరేటర్‌ శశికుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

కార్పొరేటర్‌పై దుండగుల దాడి
చికిత్స పొందుతున్న శశికుమార్‌

చిత్తూరు, ఫిబ్రవరి 27: చిత్తూరు నగరంలోని 42వ డివిజన్‌ వైసీపీ కార్పొరేటర్‌ శశికుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన చెవి భాగంలో తీవ్ర గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. తన సొంత పనుల నిమిత్తం కార్పొరేటర్‌ శశికుమార్‌ మంగళవారం కొంగారెడ్డిపల్లెకు వెళ్లి ఇంటికి తిరుగుపయనం అయ్యారు. ఆర్టీసీ బస్టాండు మీదుగా రైల్వే స్టేషన్‌ సమీపంలో వస్తున్న సమయంలో పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై నుంచి కొంత మంది చప్పట్లు కొట్టి పిలిచారు. దీంతో ఆయన ద్విచక్ర వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లారు. రాత్రి సమయం కావడంతో ఆ ప్రాంతం చీకటిగా ఉంది. శశికుమార్‌ వారి దగ్గరకు వెళ్లగానే అక్కడున్న వారు బీరు బాటిళ్లతో అతడి తలపై కొట్టే సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో చెవి భాగంపై తగలడంతో గట్టిగా అరవగా.. సమీపంలోని ఆటో డ్రైవర్లు వెళ్లారు. తన తమ్ముడికి ఫోన్‌ చేయమని నంబరు చెప్పి శశికుమార్‌ పడిపోయారు. ఆటో డ్రైవర్ల సమాచారంతో కుటుంబీకులు అక్కడికి చేరుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వన్‌టౌన్‌ సీఐ విశ్వనాథరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతున్న శశికుమార్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అతడు కోలుకున్నాక దాడి గురించి పూర్తి వివరాలు తెలియవచ్చని పోలీసులు అంటున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:27 AM