Share News

రెడ్లంతా టీడీపీలోనే ఉన్నాం

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:44 AM

తేల్చిచెప్పిన గూడూరు నియోజకవర్గంలోని నేతలు

రెడ్లంతా టీడీపీలోనే ఉన్నాం
సమావేశంలో ప్రసంగిస్తున్న పాశిం సునీల్‌కుమార్‌

కోట, జనవరి 7: టీడీపీలోనే నాలుగు దశాబ్దాలుగా మా వర్గానికి గుర్తింపు వచ్చింది. తగిన పదవులు ఇచ్చారు. మేమెక్కడికీ వెళ్లలేదు. టీడీపీలోనే ఉన్నాం. బయట జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు’ అంటూ రెడ్ల కుటుంబాల్లోని నేతలు తేల్చి చెప్పారు. కోట పట్టణంలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఆదివారం గూడూరు నియోజకవర్గస్థాయి రెడ్డి సామాజిక వర్గం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని గూడూరు, కోట, చిల్లకూరు, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన 600పైగా రెడ్ల కుటుంబాలు హాజరయ్యాయి. ఎన్టీఆర్‌.. పార్టీని స్థాపించిన నాటినుంచి ఇప్పటి వరకు టీడీపీలోనే రెడ్లకు ప్రాఽధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌కు గూడూరు టిక్కెట్‌ ఇస్తే.. అత్యధిక మెజార్టీతో గెలిపించి.. చంద్రబాబుకు కానుకగా ఇస్తామన్నారు. వైసీపీలో రెడ్లను వాడుకున్నారేతప్ప సముచితస్థానం కల్పించలేడం లేదని చెప్పారు. అందువల్ల అక్కడున్న వారంతా కూడా టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రచారంలోకి అన్ని కుటుంబాలు దిగుతాయని స్పష్టం చేశారు. అనంతరం పాశిం సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ.. తాను దశాబ్దకాలంగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి కార్యకర్త కష్టంలోనూ పాల్పంచుకుంటున్నానని చెప్పారు. తనపై ఇంతటి అభిమానం చూపించిన రెడ్ల కుటుంబాలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పడంతో ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో భవనం మార్మోగింది. ఆయా మండలాల టీడీపీ అధ్యక్షులు సర్వోత్తమరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, కిషోర్‌నాయుడు, వెంకటేశ్వరరాజులతోపాటు రాష్ట్ర నాయకులు ఈశ్వరవాక శివకోటారెడ్డి, శ్రావణిరెడ్డి, భారతీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:44 AM