చిత్తూరు జిల్లాలో 15 నామినేషన్లు
ABN , Publish Date - Apr 19 , 2024 | 01:26 AM
చిత్తూరు జిల్లాలో తొలిరోజైన గురువారం చిత్తూరు పార్లమెంటు స్థానానికి 1, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాలకు బోణీ కాలేదు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ తరఫున దగ్గుమళ్ల ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 18:చిత్తూరు జిల్లాలో తొలిరోజైన గురువారం చిత్తూరు పార్లమెంటు స్థానానికి 1, ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాలకు బోణీ కాలేదు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ తరఫున దగ్గుమళ్ల ప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు.పుంగనూరు స్థానానికి టీడీపీ తరఫున చల్లా రామచంద్రారెడ్డి, చల్లా పూజారెడ్డి, కాంగ్రెస్ నుంచి జి.మురళీమోహన్, సోషియల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఖాన్దాది షేక్ అన్వర్ బాషా నామినేషన్ దాఖలు చేశారు.నగరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి జి.భానుప్రకాష్ భారీ జన సందోహంతో తరలివచ్చి నామినేషన్ వేశారు.తెలుగుతమ్ముళ్లు స్వచ్ఛందంగా పదివేల మందికి పైగా తరలిరావడంతో నగరి కిక్కిరిసిపోయింది. వినాయకస్వామి ఆలయం నుంచి ర్యాలీగా టవర్క్లాక్ మీదుగా తహసీల్దారు కార్యాలయానికి తరలివెళ్లారు. పార్టీ నేత ప్రతాప్రాజు ప్రతిపాదించగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీవీరెడ్డిలతో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. గంగాధరనెల్లూరుకు టీడీపీ తరఫున గాంధీ రత్నవేలు, స్వతంత్ర అభ్యర్థిగా ఉసురుపాటి పద్మనాభం నామినేషన్ దాఖలు చేశారు.చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి మూడు సెట్లు, టీడీపీ అభ్యర్థి జీసీ జగన్మోహన్ రెండుసెట్ల నామినేషన్ వేశారు.పలమనేరు నియోజకవర్గానికి వైసీపీ తరఫున ఎన్.వెంకటేగౌడ, ఎన్.పావని నామినేషన్ దాఖలు చేశారు.