తాగునీటి సమస్యపై వైసీపీ కౌన్సిలర్ల ఆగ్రహం
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:06 AM
ప్రజలకు తాగునీటి సరఫరా చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని అధికారులపై అధికార పార్టీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
![తాగునీటి సమస్యపై వైసీపీ కౌన్సిలర్ల ఆగ్రహం](https://media.andhrajyothy.com/media/2024/20240229/29gooty01_14b184b114.jpg)
గుత్తి, ఫిబ్రవరి 29: ప్రజలకు తాగునీటి సరఫరా చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని అధికారులపై అధికార పార్టీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ధానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హల్లో గురువారం సర్వసభ్య సమావేశం చైర్పర్సన వన్నూర్బీ, కమిషనర్ శ్రీనివాసులు సమక్షంలో నిర్వహించారు. అధికారులు, కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. అధికారులపై చైర్పర్సనతో పాటు పాలకవర్గ కౌన్సిలర్లు మండిపడ్డారు. నెలల తరబడి వార్డులలో నీటిని సరఫరా చేయకపోతే ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ అధికారులు బాధ్యతాయుతంగా కూడా పనిచేయడంలేదని ఆరోపించారు. అధికారుల తీరుపై కౌన్సిలర్లు ఒక్కసారిగా పోడియం వద్దకు చేరుకొని కమిషనర్తో వాగ్వాదం చేశారు. తాగునీరు సరఫరా చేయకపోతే ప్రజలతో వచ్చి ఆందోళన చేసే పరిస్థితి తీసుకోరావద్దని హెచ్చరించారు. నీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.