మేఘగర్జన
ABN , Publish Date - Jun 04 , 2024 | 12:20 AM
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో వానలు దంచికొట్టాయి. పలు మండలాల్లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైతులు సాగు చేసిన అరటి, మొక్కజొన్న, పత్తి పంటలు నీట మునిగాయి.
![మేఘగర్జన](https://media.andhrajyothy.com/media/2024/20240603/3_BKS_4_A_JPEG_5307134039.jpg)
ఫ పొంగిపొర్లిన వాగులు, వంకలు
ఫ నీట మునిగిన అరటి,
పత్తి పంటలు
ఫ నేలకూలిన విద్యుత స్తంభాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో వానలు దంచికొట్టాయి. పలు మండలాల్లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైతులు సాగు చేసిన అరటి, మొక్కజొన్న, పత్తి పంటలు నీట మునిగాయి. వానలకు ఈదురు గాలులు తోడవడంతో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత స్తంభాలు పడిపోయాయి. ముంగారు వానలు మురిపిస్తుండటంతో అన్నదాతలు ఆనందంగా సేద్యపు పనుల్లో నిమగ్నమవుతున్నారు.
బొమ్మనహాళ్: భారీ వర్షాలకు మండ లంలో వాగులు, వంకలు వేదావతి హగరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేదవతి హగరికి భారీగా వరదనీరు రావడంతో ఉ ద్దేహాళ్ గ్రామం వద్ద వంతెనపై వరదనీరు పారాయి. ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి హెచ్చెల్సీ ప్రధాన కాలువ 119/400 కి.మీ. వద్ద యూటీ అండర్ టెన్నల్ చానల్కు గండిపడింది. దీంతో కాలువలో నాలుగు అడుగుల మేర నీరు ప్ర వహించాయి. కొళగానహళ్లి వద్ద కబ్బాలివంక భారీ వరదనీరుతో ఉధృతంగా ప్రవహించింది. మండలంలో 91 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలంలోని ఉద్దేహాళ్, గౌనూరు, రంగాపురం క్యాంపు, కొళగానహళ్లి తదితర గ్రామాలలో సాగైన పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలు దెబ్బతిన్నాయి.
కణేకల్లు: మండలంలో ఆదివారం రాత్రి 80 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. వేదవతి హగరి ఉధృతికి కణేకల్లు - ఉరవకొండ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇంకా.. ఐదు రోజులు వానలు!
బుక్కరాయసముద్రం: నైరుతి పవనాలు రాయలసీమకు తాకాయి. దీని ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల రానున్న 5 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకలకుంట ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి తెలిపారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల భారీ నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదు అవుతున్న విషయాన్ని ఐఎండీ వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది కంటే నైరుతి పవనాలు అనుకున్న సమయం కంటే మూడు రోజులు ముందే వచ్చాయని వాతావరణ నిపుణులు తెలిపారు.