ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:03 AM
స్థానిక మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిసాయి.
![ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు](https://media.andhrajyothy.com/media/2024/20240306/_74100026b0.jpg)
అనంతపురం కల్చరల్, మార్చి 11: స్థానిక మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఉదయం కాశీవిశ్వేశ్వరస్వామికి పంచామృ తాభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణలు, విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణంలో స్వామివార్ల ఉత్సవమూర్తులకు త్రిశూలస్నానం, వసంతోత్సవం గావించారు. అదేవిధంగా ఆలయ సిబ్బంది, భక్తులు ఒకరిపై ఒకరు రంగునీళ్లు చల్లుకుంటూ వసంతోత్సవం జరుపుకున్నారు. అనంతరం రుద్రహోమం నిర్వహించి, మహాపూర్ణాహుతి గావించారు. తదనంతరం ఉత్సవాల ముగింపు సూచికగా ధ్వజ అవరోహణ గావించి, ధ్వజస్థంభ జెండాతో ఆలయ ప్రదక్షణ చేశారు. రాత్రి ఆలయంలో శివపార్వతుల ఉత్సవమూర్తులకు శయనోత్సవ సేవను నిర్వహించారు.