2 కోట్లు ఇవ్వండి..!
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:28 PM
ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి రూ.2 కోట్ల బీమా ప్రీమియంతోపాటు నష్ట పరిహారాన్ని, ఖర్చులను చెల్లించాలని ఎల్ఐసీని జిల్లా వినియోగదారుల కమిషన ఆదేశించింది. ఇరుపక్షాల వాదన విన్న అనంతరం కమిషన అధ్యక్షురాలు ఎం.శ్రీలత సోమవారం తీర్పును వెలువరించారు.
ఎల్ఐసీకి వినియోగదారుల కమిషన ఆదేశం
సేవా లోపానికి రూ.50 వేల పరిహారం కూడా..
ప్రమాద మృతుడి కుటుంబానికి అనుకూలంగా తీర్పు
అనంతపురం క్రైం, జనవరి 29: ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి రూ.2 కోట్ల బీమా ప్రీమియంతోపాటు నష్ట పరిహారాన్ని, ఖర్చులను చెల్లించాలని ఎల్ఐసీని జిల్లా వినియోగదారుల కమిషన ఆదేశించింది. ఇరుపక్షాల వాదన విన్న అనంతరం కమిషన అధ్యక్షురాలు ఎం.శ్రీలత సోమవారం తీర్పును వెలువరించారు. అనంతపురం నగరానికి చెందిన ఎన.లక్ష్మీదేవి భర్త శ్రీనివాసులు ప్రమాదవశాత్తూ రైలుకింద పడి మృతిచెందారు. ఆయన 2018 జూలై 17న పీలేరు బ్రాంచ నుంచి జీవన లాభ్ బీమా పాలసీ తీసుకున్నారు. రూ.5 లక్షలకు పైగా ప్రీమియం చెల్లించారు. తన, తన భార్య ఆర్థిక స్థితిని ఆయన ఎల్ఐసీవారికి కనపరిచారు. ఏజెంట్ సూచన మేరకు మెడికల్ సర్టిఫికెట్ కూడా పొందుపరిచాడు. ఈ పాలసీ కింద సాధారణ మరణానికి రూ.కోటి, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 కోట్లు బీమా వర్తిస్తుంది. ఈ పాలసీతోపాటు మరికొన్ని పాలసీలను కూడా శ్రీనివాసులు తీసుకున్నారు. 2020 ఫిబ్రవరి 16న ఆయన ప్రమాదవశాత్తూ మరణించినట్లు రైల్వే పోలీసులు నిర్ధారించారు. బీమా పరిహారం కోసం శ్రీనివాసులు భార్య ఎల్ఐసీ వారిని సంప్రదించారు. రూ.10 లక్షల లోపు ఉన్న పాలసీలకు సొమ్ము చెల్లించిన ఆ సంస్థ.. రూ.2 కోట్ల పాలసీని మాత్రం తిరస్కరించింది. దీంతో బాధితురాలు జిల్లా వినియోగదారుల కమిషనను ఆశ్రయించారు. పాలసీదారుకి ప్రీమియం చెల్లించే స్థోమత లేదని, ఏజెంటుతో కుమ్మక్కై దురుద్దేశ పూర్వకంగా పాలసీని పొందారని ఎల్ఐసీ వాదించింది. మరొక భారీ రుణం ఉన్నట్లు పాలసీదారు తెలియపరచలేదని, రైలు కింద పడి మరణించడం అనుమానాస్పదంగా ఉందని కూడా వాదించింది. ఈ వాదనలతో కమిషన ఏకీభవించలేదు. బీమా పరిహారాన్ని తిరస్కరించడానికి తగిన ఆధారాలను ఎల్ఐసీ చూపలేకపోయిందని స్పష్టం చేసింది. పాలసీదారు ప్రమాదవశాత్తు మరణించినట్లు అన్ని ఆధారాలను చూపించారని, ఫిర్యాదుదారుకు 60 రోజులలోగా పరిహారం మొత్తం రూ.2 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. సేవాలోపానికి, మనోవేదనకు అదనంగా రూ.50 వేలు, ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని కమిషన అధ్యక్షురాలు ఎం.శ్రీలత, సభ్యులు డి.గ్రేస్ మేరీ, బి.గోపీనాథ్తో కూడిన కమిషన తీర్పు చెప్పింది.