Share News

గుండ్లకొండలో హతమార్చి... పామిడిలో పడేశారు..!

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:14 AM

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామానికి చెందిన పల్లె లక్ష్మన్న(55)ను కుటుంబ సభ్యులే హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

గుండ్లకొండలో హతమార్చి... పామిడిలో పడేశారు..!

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

తల్లి, కుమారుడు, ప్రియుడే నిందితులు

నెలన్నర తర్వాత వెలుగు చూసిన హత్య

పామిడి, మార్చి 28: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామానికి చెందిన పల్లె లక్ష్మన్న(55)ను కుటుంబ సభ్యులే హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. లక్ష్మన్నను గుండ్లకొండలో హతమార్చి పామిడి పెన్నానది ఒడ్డున పడేశారు. ఈ విషయం 41రోజుల తర్వాత గురువారం వెలుగులోకి వచ్చింది. దేవనకొండ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు... గుండ్లకొండ గ్రామానికి చెందిన పల్లె లక్ష్మన్న, పద్మావతి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. లక్ష్మన్నకు కుమారుడు, కుమార్తె సంతానం. పద్మావతిది పత్తికొండ మండలం చక్రాల గ్రామం. భార్యాభర్తలు తరచూ గొడవపడేవారన్నారు. అలిగి పద్మావతి పుట్టింటికి వెళ్లేదన్నారు. చక్రాల గ్రామానికి చెందిన బోయ మల్లయ్యతో పద్మావతికి వివాహేతర సంబంధం ఏర్పడిందన్నారు. లక్ష్మన్న భార్యపై అనుమానం పెంచుకొని మద్యానికి బానిసై వేధించేవాడన్నారు. ఎలాగైనా భర్తను హతమార్చాలని కు మారుడు వెంకటేష్‌, ప్రియుడు మల్లయ్యతో పథ కం వేసిందన్నారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 16న రాత్రి చిత్రాన్నంలో నిద్రమాత్రలు కలిపిందన్నారు. అది తిన్న లక్ష్మన్న మత్తులోకి వెళ్లగా పథ కం ప్రకారం కుమారుడు, ప్రియుడితో కలిసి ఉరివేసిందన్నారు. చనిపోయిన తర్వాత కారులో మృతదేహాన్ని తీసుకువచ్చి పామిడి పెన్నానది ఒడ్డున కంపచెట్లలో పారేశారన్నారు. అనంతరం నెలరోజులకు తండ్రి కనిపించడం లేదని కుమారుడు పల్లె వెంకటేష్‌ దేవనకొండ పోలీసు స్టేషనలో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు భార్య, కుమారుడిని తమదైన శైలిలో విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. విష యం తెలుసుకున్న సీఐ సిబ్బందితో పామిడి పెన్నానది ఒడ్డున ఉన్న మామిడితోట సరిహద్దులో వెతకగా అప్పటికే శరీరం కుళ్లిపోయింది. ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పంచనామా చేశారు. హత్యకు పాల్పడిన భార్య పద్మావతి, కుమారుడు వెంకటేష్‌, మల్లయ్యలను అరెస్టు చేశామన్నారు. కారు, మూడు సెల్‌ఫోన్లను సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:14 AM