infrastructure: మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడతా
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:22 AM
నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే నియోజకవర్గంలో నెలకొని ఉన్న పారిశుధ్య సమస్య, తాగునీటి సమస్య, రోడ్లు, వైద్య సదుపాయాల విషయంగా దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.
![infrastructure: మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడతా](https://media.andhrajyothy.com/media/2024/20240604/10_GTL_01_400970bf4a.jpg)
ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
గుంతకల్లు, జూన10: నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే నియోజకవర్గంలో నెలకొని ఉన్న పారిశుధ్య సమస్య, తాగునీటి సమస్య, రోడ్లు, వైద్య సదుపాయాల విషయంగా దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషిచేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఏ సమస్య వచ్చినా ఓ కుటుంబ సభ్యుడిలా సాయపడతానన్నారు. పార్టీ శ్రేణులు కూడా గొడవలకు పోయి పోలీసు స్టేషన మెట్లను ఎక్కరాదని, గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ మండలాభివృద్ధి కార్యాలయం మెట్లు ఎక్కాలని సూచించారు.
కేంద్రంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంచి పలుకుబడిని సాధించారని, కేంద్ర సహకారంతో రాషా్ట్రభివృద్ధిని సాధిస్తారని పేర్కొన్నారు. బీజేపీ నాయకుడు పసుపుల హరిహరనాథ్, జనసేన నాయకుడు వాసగిరి మణికంఠ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదలకు సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, కేసీ హరి, ఆమ్లెట్ మస్తాన యాదవ్, గుమ్మనూరు వెంకటేశులు, గుజరీ మహ్మమద్ ఖాజా, పత్తి హిమబిందు, తలారి మస్తానప్ప, కోడెల చంద్రశేఖర్, అహ్మద్ బాషా, అంజి, టీ గోపి, బీజేపీ నాయకులు బండారు కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.