స్నేహితుడి కోసం వెళ్తూ మృత్యు ఒడికి..
ABN , Publish Date - Jan 17 , 2024 | 12:41 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్నేహితుడికి కావాల్సిన వస్తువులు తీసుకెళ్తూ మృత్యుఒడికి చేరిన ఓ మిత్రుడి ఉదంతమిది. ఉండబండ గ్రామం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈరన్న గాయపడ్డాడు.
విడపనకల్లు, జనవరి 16: రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్నేహితుడికి కావాల్సిన వస్తువులు తీసుకెళ్తూ మృత్యుఒడికి చేరిన ఓ మిత్రుడి ఉదంతమిది. ఉండబండ గ్రామం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈరన్న గాయపడ్డాడు. అతడిని అనంతపురం ఆస్పత్రికి తరలిం చారు. దీంతో ఆయన తన స్నేహితుడైన పాల్తూరు గ్రామానికి చెందిన కోట్లో రాముడు(48)కి ఫోన చేసి తనకు బెడ్షీట్లు, క్యారియర్ తీసుకుని అనంతపురం రమ్మన్నాడు. ఆయన రాత్రి సమయంలో బయల్దేరాడు. ఉరవకొండ మండలం కోనాపురం వద్దకు రాగానే కోట్లో రామున్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టు మార్టం అనంతరం కోట్లో రాముని కుటుంబ సభ్యులు మృత దేహంతో పాల్తూరు పోలీస్ స్టేషన చేరుకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తన స్నేహితుడు ఫోన చేసి రమ్మనటం వల్లే అనంతపురం వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడని తమకు న్యాయం చేయాలన్నారు. ఈ విషయమై పాల్తూరు పోలీసులు న్యాయం చేస్తామని తెలపటంతో కుటుంబ సభ్యులు మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు.
అంతకుముందు చీకలగురికి గ్రామానికి చెందిన కురుబ ఈరన్న ఉండబండ నుంచి ద్విచక్రవాహంపై తన సొంత గ్రామానికి సోమవారం బయలుదేరాడు ఉరవకొండకు గడ్డి లోడ్తో వస్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసి వెళ్తున్న సమయంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందకు పడిపోయాడు దీంతో ట్రాక్టర్ ముందు చక్రాలు ఈరన్న కాళ్లపై వెళ్లటంతో ఒక కాలు విరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించారు.