నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
ABN , Publish Date - Feb 15 , 2024 | 12:03 AM
ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
![నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన](https://media.andhrajyothy.com/media/2023/20231205/14mdk1_af7ce009ae.jpg)
మడకశిరటౌన, ఫిబ్రవరి 14: ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు గడిచినా ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ, పీఆర్సీతోపాటు ఇతర అలవెన్సులు చెల్లించలేదన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యమ కార్యాచరణలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. జేఏసీ నాయకులు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
బకాయిలు చెల్లించకపోతే ఉద్యమిస్తాం
హిందూపురం అర్బన: ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఉద్యమిస్తామని హిందూపురం జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఉద్యోగులు బుధవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందికి వినతి ఇచ్చారు. రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యామన్నారు. అలాగే 17న ర్యాలీ నిర్వహిస్తామన్నారు.