Share News

GUNTAKAL MPDO OFFICE : అభివృద్ధి నిధులు స్వాహా..!

ABN , Publish Date - May 23 , 2024 | 12:29 AM

అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన నిధులను కొందరు అధికారులు.. అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై కాజేశారు. గుంతకల్లు ఎంపీడీఓ కార్యాలయం వేదికగా సుమారు రూ.85 లక్షల వరకూ ఆరగించినట్లు సమాచారం. గతంలో పనిచేసిన కొందరు అధికారులు, వైసీపీ ప్రజాప్రతినిధులు ఏకమై స్వాహా చేశారని విశ్వసనీయంగా తెలిసింది. పనులు సక్రమంగా చేయకుండా జేబులు నింపుకున్న ఈ వ్యవహారం గురించి జడ్పీ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు వెళ్లినా.. ఎలాంటి స్పందన లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా ఒక మహిళా ఉద్యోగి సొంత ఖాతాకు రూ.20 లక్షలు మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు, నాయకులు కలిసి నాలుగేళ్లలో రూ.60 ...

GUNTAKAL MPDO OFFICE : అభివృద్ధి నిధులు స్వాహా..!
Guntakallu MPDO office

గుంతకల్లు ఎంపీడీఓ కార్యాలయంలో మాయ

అధికారులు, వైసీపీ నాయకులు కుమ్మక్కు

రూ.85 లక్షల దాకా పక్కదారి

ఓ మహిళా ఉద్యోగి ఖాతాకు రూ.20 లక్షలు

ఫిర్యాదులు వెళ్లినా స్పందించని జడ్పీ అధికారులు

అనంతపురం విద్య, మే 22: అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన నిధులను కొందరు అధికారులు.. అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై కాజేశారు. గుంతకల్లు ఎంపీడీఓ కార్యాలయం వేదికగా సుమారు రూ.85 లక్షల వరకూ ఆరగించినట్లు సమాచారం. గతంలో పనిచేసిన కొందరు అధికారులు, వైసీపీ ప్రజాప్రతినిధులు ఏకమై స్వాహా చేశారని విశ్వసనీయంగా తెలిసింది. పనులు సక్రమంగా చేయకుండా జేబులు నింపుకున్న ఈ వ్యవహారం గురించి జడ్పీ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు వెళ్లినా.. ఎలాంటి స్పందన లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా ఒక మహిళా ఉద్యోగి సొంత ఖాతాకు రూ.20 లక్షలు మళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు, నాయకులు కలిసి నాలుగేళ్లలో రూ.60 లక్షల నుంచి రూ.85 లక్షలు కాజేశారని తెలిసింది. కలెక్టర్‌ దృష్టి సారిస్తే ఈ అవినీతి బాగోతం బయటపడుతుందని అంటున్నారు.


దోపిడీకి ఏకమయ్యారా....?

గుంతకల్లు మండలంలో గతంలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. ఎంపీడీఓ కార్యాలయ పరిధిలో ప్రజాభివృద్ధికి వీటిని ఖర్చు చేయాల్సి ఉండగా.. పనులు సక్రమంగా చేయకుండా నిధులను పక్కదారి పట్టించారు. 2019 నుంచి గత ఏడాది చివరి వరకూ పనిచేసిన ఒక ఎంపీడీఓ, మరో ముగ్గురు అధికారులు, కొందరు కాంట్రాక్టర్లు, వైసీపీ నాయకులు కలిసి ఈ మాయాజాలం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. గత నాలుగేళ్ల కాలంలో జనరల్‌ ఫండ్స్‌, 15వ ఆర్థిక సంఘం నిధులను విచ్చలవిడిగా డ్రా చేశారని తెలిసింది. పనులు చేసినట్లు సరైన డాక్యుమెంట్లు లేకుండానే నిధులను డ్రా చేసి స్వాహా చేశారని సమాచారం.

ఆమె ఖాతాకు రూ.20 లక్షలు

నిధులను పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఓ మహిళా ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఆమె ఖాతాకు ఏకంగా రూ.20 లక్షలు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. గుంతకల్లులో పనిచేస్తూ మరో మండలానికి బదిలీ అయిన ఆమె, తన అక్రమాలు బయట పడకుండా మళ్లీ గుంతకల్లుకు డెప్యుటేషన వేయించుకున్నారని తెలిసింది. ఆమె సొంత ఖాతాకు అంత సొమ్ము ఎందుకు మళ్లించారనే అనుమానాలు కలుగుతున్నాయి.కొత్తగా వచ్చిన ఎంపీడీఓ.. ఆమెకు మెమో కూడా జారీ చేసినట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకూ ఆమె సంజాయిషీ ఇవ్వలేదని తెలుస్తోంది.


జడ్పీ అధికారుల మౌనం..?

గుంతకల్లు ఎంపీడీఓ కార్యాలయంలో సాగిన నిధుల గోల్‌మాల్‌ గురించి ఇటీవల జడ్పీ సీఈఓకు పలువురు ఫిర్యాదు చేశారు. భారీగా అక్రమాలు జరిగాయని, విచారించి.. బాధ్యులైన ఎంపీడీఓ, మరో నలుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కానీ జడ్పీ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కలెక్టర్‌ దృష్టి సారించి విచారణ చేయిస్తే అక్రమాల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 23 , 2024 | 12:29 AM