COLLECTOR: నూతన ఒరవడికి కలెక్టర్ శ్రీకారం
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:29 PM
ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీకోసం నిర్వహణలో కలెక్టర్ వినోద్కుమార్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి కలెక్టర్ అరగంట ముందే హాజరై అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ఓపికతో వినతుల స్వీకరణ
490 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వినోద్కుమార్
అనంతపురం టౌన, జూలై 8: ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీకోసం నిర్వహణలో కలెక్టర్ వినోద్కుమార్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనలో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి కలెక్టర్ అరగంట ముందే హాజరై అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులు విన్నవించే సమస్యలను కలెక్టర్ ఓపిగా విన్నారు. అనంతరం అక్కడి నుంచే సంబంధిత శాఖ అధికారితో మైక్లో మాట్లాడుతూ బాధితుల సమస్యలు వారి దృషి ్టకి తీసుకెళ్లి వీరి సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నిస్తూ బాధితులను ఆ శాఖ అధికారి వద్దకు పంపిస్తున్నారు. గతంలో ఫిర్యాదు వస్తే ఆశాఖ అధికారి వచ్చి ఫిర్యాదు పేపర్ తీసుకొని వెళ్లేవారు. ప్రస్తుతం కలెక్టర్ ప్రతి వినతిపైనా స్పందిస్తూ అధికారులతో బాధితుల ముందే మాట్లాడుతున్నారు. ఒక దశలో అదే సమస్య మళ్లీ మళ్లీ వచ్చినట్లు తెలియగానే ఆ శాఖ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధితులందరూ మీ కోసంలో ఇతర అధికారులు ఉన్నా కలెక్టర్ను కలిసి సమస్యను విన్నవించి వినతులు అందజేస్తున్నారు. వారు అందించిన ఫిర్యాదును కలెక్టర్ ఓపికతో స్వీకరిస్తూ బాధితులతో మాట్లాడి పంపిస్తున్నారు. సోమవారం మీకోసంలో 490 వినతులు రాగా వాటిని కలెక్టర్, ఇతర అధికారులు స్వీకరించారు.
అనంతపురం రూరల్మండలం కక్కలపల్లి పంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేస్తున్నవారిపై విచారించి చర్యలు తీసుకోవాలని వెంకటస్వామి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కక్కలపల్లి కాలనీ కళ్యాణదుర్గం రోడ్డు సర్వే నెం.14-2లో 6-80ఎకరాలలో అక్రమంగా లేఅవుట్ వేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లాట్లు అమ్ముతున్నారని, వీటిపై విచారణ జరిపించాలని ఫిర్యాదు చేశారు.
జిల్లాకేంద్రంలోని ఎస్ఎ్సబీఎన ఎయిడెడ్ డిగ్రీ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ను నియమించాలని ఆ కళాశాల విద్యార్థులు కలెక్టరును కోరారు.
నిబంధనలకు విరుద్ఘంగా 4వ రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేట్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విన్నవించారు. ఐక్యవిద్యార్థి సంఘాల నాయకులు ప్రతిబాభారతి, వీరేంద్ర, నవీన, వీరు, రాజేంద్ర, చైతన్య, శంకర్ తదితరులు కలెక్టరును కలిసారు.
వినతులు ఇచ్చేందుకు వచ్చే దివ్యాంగులకు లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వసంతకుమార్ కలెక్టర్ను కోరారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 50వేలమంది దివ్యాంగులు ఉన్నామని, ప్రధానంగా మహిళలు, గర్భిణులు, వృద్ధులు వస్తే వారు రెవెనూభవనలోకి రావడానికి ఎంతో కష్టపడాల్సి వస్తోందన్నారు.