అడవుల్లో నీటి వనరులు
ABN , First Publish Date - 2023-03-27T00:05:06+05:30 IST
జిల్లాలో 1.40 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. గూడూరు అభయారణ్యంతో పాటు గంగారం, కొత్తగూడ, బయ్యారం మండలాల్లో అడవులు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతంలో జింకలు, కనుజులు, దుప్పులు, ఎలుగుబంట్లు, నక్కలు, హైనాలు, ఇతర వన్యప్రాణులు, పక్షులు నివసిస్తున్నాయి. అయితే ఎండ తీవ్రత రోజు రోజుకు అధిక మవుతుండడంతో అడవుల్లో నీటి వనరులు అడుగంటిపోయి వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన వనాలు ఆకు రాల్చడంతో అటవీ జంతువులు తమ స్థావరాలను వీడి ఆగమవుతున్నాయి.
వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ఏర్పాట్లు
సాసర్ ఫిట్లు, నీటి కుంటల తవ్వకాలు
అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ
వేసవి దృష్ట్యా ప్రణాళికలు
గూడూరు, మార్చి 26: జిల్లాలో 1.40 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. గూడూరు అభయారణ్యంతో పాటు గంగారం, కొత్తగూడ, బయ్యారం మండలాల్లో అడవులు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతంలో జింకలు, కనుజులు, దుప్పులు, ఎలుగుబంట్లు, నక్కలు, హైనాలు, ఇతర వన్యప్రాణులు, పక్షులు నివసిస్తున్నాయి. అయితే ఎండ తీవ్రత రోజు రోజుకు అధిక మవుతుండడంతో అడవుల్లో నీటి వనరులు అడుగంటిపోయి వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన వనాలు ఆకు రాల్చడంతో అటవీ జంతువులు తమ స్థావరాలను వీడి ఆగమవుతున్నాయి. నీళ్లు, ఆహారం కోసం వనాలను దాటి బయటకు వచ్చి దారి తప్పుతూ... గ్రామాల్లోకి వస్తున్నందున అటవీశాఖ అప్రమత్తమైంది. వన్యప్రాణులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని అవగాహన సదస్సులను నిర్వహించారు. వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు.
అభయారణ్యంలో చెక్డ్యాంల నిర్మాణం..
గూడూరు అభయారణ్యంలో వివిధ రకాల వన్యప్రాణులు, మృగాల దాహార్తిని తీర్చేలా నిర్మాణాలు చేపట్టారు. ఇందులో ముఖ్యంగా వానాకాలంలో గుట్టలు, ఎత్తైన ప్రాంతాల నుంచి వృథాగా పోయే వరద ప్రవాహాన్ని ఒడిసి పట్టేలా అటవీశాఖ అధికారులు నిర్మాణాలు చేపట్టారు. పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసేందుకు చెక్డ్యాంలు నిర్మించారు. వరద ప్రవాహ మార్గాలు, నీటి కోసం వన్యప్రాణులు సంచరించే మార్గాలను శాస్త్రీయంగా గుర్తించి చెక్డ్యాంలు, పర్క్యూలేషన్ ట్యాంకుల నిర్మాణాలను చేపట్టారు. నీళ్లు అందుబాటులో ఉండడంతో అడవిని దాటి జంతువులు బయటకు వెళ్లే అవకాశం ఉండదు.
సాసర్ఫిట్, సిమెంట్ కుండీల్లో నీటి నిల్వ
మార్చి నుంచి ఎండ తీవ్రతతో పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో అటవీ ప్రాంతాల్లో సహజ సిద్ధమైన నీటి వనరులు అడుగంటిపోతాయి. చెక్డ్యాంలు సైతం ఎండిపోయి అటవీ జంతువులకు ఇబ్బందిగా మారుతుంది. అడవుల్లో ఉన్న వృక్షాలు ఆకు రాల్చడంతో సరైన ఆహారం లభించని పరిస్థితి ఉంటుంది. జింకలు, కనుజులు, దుప్పులు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి పందులు, నక్కలు, హైనాలు, ఇతర వన్యప్రాణులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. జంతువులు సంచరించే మార్గాలలో నీటి నిల్వ కోసం సాసర్ఫిట్(నీటితొట్టి), సిమెంట్ ఓడలతో నిర్మాణాలు చేపట్టారు. వీటిల్లో ప్రతి రోజు ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతుండడంతో వన్యప్రాణులు, జంతువులు, పక్షుల దాహార్తి తీరుతుంది.
సీసీ కెమెరాల ఏర్పాటు..
వన్యప్రాణులను వేటగాళ్ల ఉచ్చుల నుంచి కాపాడడానికి అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. వేటగాళ్లపై నిరంతర నిఘా పెట్టి వారి కదలికలను నియంత్రిస్తున్నారు. అభయారణ్యంలో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి వేళల్లో బేస్క్యాంప్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. నిఘాతో పాటు కొరియర్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు.
వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు : బి.సురేష్, ఎఫ్ఆర్వో, గూడూరు
అడవుల అభివృద్ధి, వన్యప్రాణుల దాహార్తిని తీర్చడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. వేసవి కాలం రావడంతో వన్యప్రాణుల దాహార్తిని తీర్చడానికి 4 చెక్డ్యాంలు, 15 నీటికుంటలు, 10 సాసర్ఫిట్లు, 30 సాసర్ రింగ్లు, 5 సోలార్ పంప్సెట్ల నిర్మాణాలు పూర్తి చేశాం. ప్రతి రోజు ఆయా వాటిల్లో ట్యాంకర్, బోర్ల ద్వారా నీటిని నింపుతున్నాం. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవు. 1972 వన్యప్రాణి చట్టం ప్రకారం శిక్షలు అమలు చేస్తాం.