పారిశుధ్య నిర్వహణపై అధ్యయనం

ABN , First Publish Date - 2023-06-26T01:01:39+05:30 IST

స్టడీ టూర్‌లో భాగంగా మానుకోట మునిసిపల్‌ పాలక మండలి సభ్యులు, అధికారులు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌ పట్టణాన్ని ఆదివారం సందర్శించారు. పారిశుధ్యం, తడిచెత్త నిర్వహణ, నగర అటవీ, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించారు.

పారిశుధ్య నిర్వహణపై అధ్యయనం
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌ సిటీలో నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడుతున్న మానుకోట మునిసిపల్‌ పాలకమండలి సభ్యులు, అధికారులు

ఇండోర్‌లో మునిసిపల్‌ పాలకమండలి, అధికారుల పర్యటన

మహబూబాబాద్‌ టౌన్‌, జూన్‌ 25: స్టడీ టూర్‌లో భాగంగా మానుకోట మునిసిపల్‌ పాలక మండలి సభ్యులు, అధికారులు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌ పట్టణాన్ని ఆదివారం సందర్శించారు. పారిశుధ్యం, తడిచెత్త నిర్వహణ, నగర అటవీ, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించారు. ఇండోర్‌ నగర పాలక సంస్థలో అవలంభిస్తున్న పారిశుధ్య నిర్వహణ విధానాలను అధ్యయనం చేశారు. తడి చెత్త నిర్వహణపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నుంచి సేకరించిన చెత్త నుంచి వేరు చేసిన తడి చెత్త ద్వారా బయోగ్యాస్‌, సెంద్రీయ ఎరువుల తయారీ విధానాన్ని ఇండోర్‌ అధికారులు వివరించినట్లు స్థానిక మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి తెలిపారు. బ్రిటిష్‌ కాలం నుంచి 2015 వరకు ఉన్న డంపింగ్‌ యార్డును బయోరెమిడియేషన్‌ టెక్నాలజీతో 15 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను తొలగించి వంద ఎకరాల నగర అటవీ (సిటీఫారెస్టు) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారన్నారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌లో జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా పారిశుధ్య వాహనాల లొకేషన్‌ను గుర్తించడం, వార్డుల్లో ఎంత శాతం చెత్త సేకరణ పూర్తి చేశాయో గుర్తించే విధానాలను ఇండోర్‌ అధికారులు వివరించారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో వైస్‌ చైర్మన్‌ ఎండి.ఫరీద్‌, కమిషనర్‌ ప్రసన్నారాణి, డీఈ ఉపేందర్‌, ఫ్లోర్‌ లీడర్‌లు చిట్యాల జనార్దన్‌, సూర్నపు సోమయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T01:01:39+05:30 IST