గిరిజనులకు మెరుగైన సేవలు అందించాలి
ABN , First Publish Date - 2023-06-26T23:55:37+05:30 IST
గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి మెరుగైన సేవలు అందించేందుకు సెక్టోరియల్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు.
గిరిజన దర్బార్లో ఐటీడీఏ పీవో అంకిత్
ఏటూరునాగారం రూరల్, జూన్ 26: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి మెరుగైన సేవలు అందించేందుకు సెక్టోరియల్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం గిరిజన దర్బార్ను నిర్వహించారు. గిరిజనుల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. దర్బార్లో మొత్తం 32 మంది గిరిజనులు పీవోకు వినతులు అందించారు. ఐటీడీఏ పరిధిలోని పీహెహెచ్సీల్లో స్టాఫ్నర్సు ఉద్యోగం ఇప్పించాలని వాజేడు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన మడే కవిత వినతి పత్రం అందించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న భవన అంతస్థులను నిలిపి వేయాలని జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షుడు ముద్దబోయిన రవి విన్నవించారు. ఏటూరునాగారం ఆకులవారిఘణపురంలోని గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలలలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, ప్రహరీ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షక్షుడు పులిసే బాలకృష్ణ కోరారు. వానాకాలంలో రోడ్ల పరిస్థితి ఆధ్వాన్నంగా మారుతుందని, ఐటీడీఏ ద్వారా నిధులు కేటాయించి సీసీ రోడ్లను నిర్మించాలని వాజేడు మండలం దూలపురం సర్పంచు కోరం సాంబయ్య పీవో దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని నర్సంపేట మండలం రాజుపేట గ్రామ సర్పంచు బానోతు దస్రునాయక్ వినతి పత్రం అందించారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీ పీఈటీగా ఉద్యోగావకాశం కల్పించాలని వెంకటాపురం మండలం టోకులబోరు గ్రామానికి చెందిన కాక గంగాభవాని విన్నవించారు. భూపాలపల్లి జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్టీలుగా విధులు నిర్వర్తిస్తున్న 14 మందిని సొంత జిల్లాలకు బదిలీ చేయాలని సీఆర్టీల రాష్ట్ర సంఘం నాయకులు పీవోను కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హేమలత, ఈవో దామోదరస్వామి, జీసీసీ డీఎం ప్రతాప్రెడ్డి, పీహెచ్వో రమణ, ఏడీఏ శ్రీధర్, ఫీసా జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.