ప్రజల కల సాకారమవుతోంది
ABN , First Publish Date - 2023-06-03T00:22:12+05:30 IST
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కల సాకారమవుతోందని ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
జిల్లాకే తలమానికంగా కాళేశ్వరం ప్రాజెక్టు
విద్యా, వైద్య రంగాల్లో మెరుగైన సేవలు
పరుగులు పెడుతున్న పట్టణ ప్రగతి
100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ఏర్పాటు
రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్రెడ్డి
భూపాలపల్లి టౌన్, జూన్ 2 : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కల సాకారమవుతోందని ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరై, పోలీసుల ద్వారా గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కార్యక్రమానికి కలెక్టర్ భవే్షమిశ్రా అధ్యక్షత వహించగా, పల్లా మాట్లాడారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెర వేర్చే దిశగా సీఎం కేసీఆర్ వీరోచిత పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిందన్నారు. నూతన రాష్ట్రంలో ఉద్యమ నాయకుడే ప్రభుత్వ పాలన చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని గత 9 ఏళ్లుగా అభివృద్ధిలో అగ్రగామిగా, దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో 21 రోజుల పాటు పండుగ వాతావరణం కల్పించేలా కార్యక్రమాలు చేపట్టారని సూచించారు. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించి ప్రజల సాగు, తాగునీటి ఆకాంక్షను నెరవేర్చారని అన్నారు. 100 ఎంబీబీఎస్ సీట్లతో భూపాలపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు జరుగుతుందని అన్నారు.
సాగునీటి రంగంలో అగ్రగామి..
తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ పేరుతో చారిత్రక జిల్లాను ఏర్పాటు చేసి గోదావరిపై దేశానికి ఆదర్శంగా నిలిచే కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టును నిర్మించడం గొప్ప విషయమని పల్లా అన్నారు. చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులు, చెక్డ్యాంల నిర్మాణాల ఫలితంగా వ్యవసాయం, మత్య్సరంగం మంచి ఫలితాలు సాధిస్తోందని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 18.26 ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 18.8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా ప్రభుత్వం రికార్డు స్థాయిలో ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిందని అన్నారు.
పాఠశాలల అభివృద్ధి..
జిల్లాలో విద్యా, వైద్య రంగాల్లో ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ‘మన ఊరు-మన బడి’ పథకం కింద మెదటి దశలో 149 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టిందని అన్నారు. రూ.1.53కోట్లతో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ శిక్షణ బైజ్యూస్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు ఉచితంగా 134 రకాల వైద్య పరీక్షలు చేసేందుకు గాను రూ.2కోట్లు వెచ్చించి జిల్లా ఆస్పత్రిలో డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 100 పడకల ఆస్పత్రిని 350కి అప్గ్రేడ్ చేశామని అన్నారు.
ఉపాధి, వ్యవసాయ రంగాల్లో ముందడుగు..
జిల్లాలో ఉపాధి, వ్యవసాయ రంగాల్లో ముందడుగు వేశామని పల్లా అన్నారు. 1,08,197 మంది రైతులకు రూ.961 కోట్లు రైతుబంధు కింద పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నామని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. జిల్లాలోని 58,170 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు గాను 5,574 మహిళా సంఘాలకు రూ.1,053.1కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించినట్లు తెలిపారు. రూ.35.55 కోట్లతో సమీకృత కలెక్టరేట్ భవనం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు.
పరుగులు పెడుతున్న పట్టణ ప్రగతి..
భూపాలపల్లి మునిసిపల్ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. రూ.3,244 కోట్ల వ్యయంతో 252 సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులు పూర్తి చేశామని అన్నారు. రూ.కోటితో డంపింగ్ యార్డు, రూ.40లక్షలతో 8 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశామన్నారు. రూ.70 కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నామని అన్నా రు. జిల్లాలో దళితబంధు పథకం కింద 151 వంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ఖాతాల్లో రూ.9.90 లక్షలు వేసినట్లు తెలిపారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహు తులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు వేసిన నృత్యం దేశభక్తిని చాటిచెప్పింది. అలాగే కురుమలు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు
మహిళా శిశు సంక్షేమ శాఖ, మత్సశాఖ, జౌలీశాఖ, పరిశ్రమల శాఖ, విద్యాశాఖ, డీఆర్డీఏ శాఖ ద్వా రా ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఎమ్మెల్సీ, దళితబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రారంభించారు.
అమరవీరుల కుటుంబాలకు సన్మానం
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవే్షమి శ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర ఘనంగా శాలువాలతో సత్కరించారు. సీఎం కప్ క్రీడా పోటీలలో రాష్ట్ర స్థాయిలో బ హుమతులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి సన్మానం చేశారు. జిల్లా ఎస్పీ సురేందర్, ఏఎ్సపీ శ్రీనివాసులు, మునిసిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.