మరింత ‘సహకారం’
ABN , First Publish Date - 2023-04-03T00:02:53+05:30 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబి) సేవలు త్వరలో మరింత చేరువకానున్నాయి. మరింత విస్తృతం కూడా కానున్నాయి. కొత్త జిల్లాలో డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని అన్ని డీసీసీబీలు, వాటి పరిధిలో పని చేస్తున్న బ్రాంచీల్లో ఉన్న సిబ్బంది, ఇతరత్రా వివరాలను తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) అధికారులు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం కొత్త ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు.
విస్తృతం కానున్న డీసీసీబీ బ్యాంకు సేవలు
కొత్త జిల్లాల్లో ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు
బ్రాంచీల్లో ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు
త్వరలో మరిన్ని సంఘాల ఏర్పాటుకు సన్నాహాలు
పీఏసీఎస్లకు తొలగనున్న ఇబ్బందులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబి) సేవలు త్వరలో మరింత చేరువకానున్నాయి. మరింత విస్తృతం కూడా కానున్నాయి. కొత్త జిల్లాలో డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని అన్ని డీసీసీబీలు, వాటి పరిధిలో పని చేస్తున్న బ్రాంచీల్లో ఉన్న సిబ్బంది, ఇతరత్రా వివరాలను తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) అధికారులు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం కొత్త ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు.
హనుమకొండ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించడం వల్ల కొత్తగా ఆరు జిల్లాలు– వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశం కర్ భూపాలపల్లి ఏర్పాటయ్యాయి. ఈ కొత్త జిల్లాల్లో ఇప్పటి వరకు డీసీసీబీలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్న డీసీసీబీ శాఖలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) హనుమకొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయం పరిధిలోనే పనిచేస్తున్నాయి. కొత్త జిల్లాల్లో డీసీసీబీలను ఏర్పాటుకు భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ), నాబార్డు అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలో డీసీసీబీల ప్రారంభానికి అవకాశం లేకపోవడంతో వాటి స్థానంలో ప్రాంతీయ కార్యాలయా లను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఆయా జిల్లాల పరిధిలోని డీసీసీబీ శాఖల నిర్వ హణపై అజమాయిషీ కూడా ఈ కార్యాలయాలకు ఉంటాయి. దీనివల్ల కొత్త జిల్లాలోని పఏసీఎస్లు, డీసీసీబీ శాఖలు ప్రతీ చిన్నవిషయానికి డీసీసీబీ దగ్గరకు రావ లసిన ఇబ్బంది తప్పింది. రుణాల మంజూరీ, రికవరీ, డిపాజిట్ల సేకరణ ఇతరత్రా కార్యకలాపాలను ఈ ప్రాంతీయ కార్యాలయాలు పర్యవేక్షిస్తాయి. డీసీసీబీపై ప్రస్తుతం పడుతున్న ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.
సిబ్బంది సర్దుబాటు
ప్రస్తుతం ఆయా జిల్లాకేంద్రాల్లో ఉన్న డీసీసీబీ బ్రాంచి కార్యాలయాల్లోనే ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న డీసీసీబీ నుంచి అధికారులు, సిబ్బందిని ఈ కార్యాలయాల్లో సర్దు బాటు చేస్తారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్ల్లో కొన్ని నామమాత్రంగా పని చేస్తుండగా మరికొన్ని రైతుల అవసరాలను తీరుస్తూ సమర్ధవంతంగా పని చేస్తున్నాయి. ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటయితే ఈ సంఘా ల కార్యకలాపాలు మరింత విస్తృతం కానున్నాయి.
కొత్త సంఘాలు
దేశంలో వచ్చే అయిదేళ్లలో రెండు లక్షల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటుచేయాలని కేంద్రమంత్రి మండలి నిర్ణయం తీసుకన్నది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరిన్ని పీఏసీఎస్లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న సంఘా ల ద్వారా రైతులకు కొన్ని సేవలు మాత్రమే అందుతున్నాయి. గ్రామానికో సంఘం ఏర్పాటు చేసి రైతులకు 25 రకాల సేవలు అందించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. సంఘాలు పెరిగితే సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా కొత్తగా ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూర్చి నట్లవుతుంది.
గతంలో జోనల్ ఆఫీసులు
డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు కొత్తేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు, నాలుగు జిల్లాలకు కలిపి ఒక జోనల్ కార్యాలయం చొప్పున ఉండేవి. వరంగల్ జోనల్ కార్యాలయం హనుమకొండలో ఒక అద్దె భవనంలో పని చేసేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఈ జోనల్ కార్యాలయాలు టెస్కాబ్లో విలీనం అయ్యాయి. తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు ప్రాంతీయ కార్యాలయాల రూపంలో మళ్లీ ఏర్పాటవుతున్నాయి.
105 ఏళ్ల చరిత్ర
వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్కు 105 ఏళ్ల చరిత్ర ఉంది. 1917లో ఈ బ్యాంకు ఏర్పాటైంది. ఆ తర్వాత కాలంలో మహబూబాబాద్, ఖమ్మంలో మరో రెండు బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మహ బూబాబాద్లోని బ్యాంకును వరంగల్ డీసీసీబీలో విలీనం చేశారు. అప్పటి నుంచి వరంగల్ డీసీసీబీ అంచెలంచెలుగా ఎదిగింది. రైతుల అవసరాల మేరకు కొత్త బ్రాంచీలతో విస్తరించింది. మూడేళ్లలో బ్యాంకు టర్నోవర్ రూ.550 కోట్ల నుంచి రూ.1212 కోట్లకు చేరింది.
27 శాఖలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీసీసీబీకి 27 శాఖలు ఉన్నాయి. వీటిలో మొత్తం 4,15,000 మంది ఖాతాదారులు ఉన్నారు. వీరిలో 3 లక్షల మంది ఎస్బీ ఖాతాదారులు కాగా, 1,1500 మంది రుణగ్రహీతలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలోని సభ్యులకు డీసీసీబీ తన సేవలను అందిస్తోంది. డీసీసీబీ తన పరిధిలోని ఆరు జిల్లాల్లోని రైతులకు రుణాలు ఇస్తోంది. అన్నదాతలకు పంట రుణాలు, దీర్ఘకాలిక, స్వల్ప కాలిక, వ్యాపార తదితరు రుణాలు అందించాలంటే డీసీసీబీ అనుమతిని ఆరు జిల్లాల పరిధిలోని ఆ బ్యాంకు శాఖలు అనుమతి పొందాల్సి ఉంటుంది. కేంద్ర బ్యాంకు ఆమోదదంతోనే బ్యాంకు శాఖలు తమ పరిధిలోని పీఏసీఎస్ల ద్వా రా రైతుల రుణ అవసరాలను తీరుస్తున్నాయి.
ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు..
– చిన్నారావు, కార్యనిర్వహణాధికారి, వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్
డీసీసీబీ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలేవీ ఇప్పటివరకు జారీ కాలేదు. విధివిధానాలకు సమాచారం కూడా ఏమీ లేదు. గతంలో జోనల్ కార్యాలయాలు ఉండేవి. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉండవచ్చు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు విషయంలో తగిన చర్యలు తీసుకుంటాము. జిల్లాకు ఒకటి చొప్పున ఆరు ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఈ కార్యాలయాల పరిధిలో ఆయా జిల్లాలోని డీసీసీబీ శాఖలు, పీఏసీఎస్ల కార్యకలాపాలు ఉంటాయి.