MLA Rajaiah: తోబుట్టువుల పక్కన నిలబడలేకపోతున్నా..
ABN , First Publish Date - 2023-03-16T02:37:37+05:30 IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతమయ్యారు. 63 ఏళ్ల వయస్సున్న తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఏంటని బోరున విలపించారు. ఇలాంటి ఆరోపణల వల్ల తోబుట్టువుల పక్కన కూడా నిలబడ లేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు 63 ఏళ్లు.. నాపై లైంగిక వేధింపుల ఆరోపణలా ?
బోరున విలపించిన ఎమ్మెల్యే రాజయ్య
ధర్మసాగర్, మార్చి 15: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతమయ్యారు. 63 ఏళ్ల వయస్సున్న తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఏంటని బోరున విలపించారు. ఇలాంటి ఆరోపణల వల్ల తోబుట్టువుల పక్కన కూడా నిలబడ లేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షమైనా, స్వపక్షమైనా ఇలాంటి రాజకీయాలు తగవని, ఫేస్ టు ఫేస్ తేల్చుకుందామని సవాలు చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలో బుధవారం జరిగిన ఫాదర్ కొలంబో జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. ఫాదర్ కొలంబో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసిన తర్వాత మాట్లాడుతూ రాజయ్య భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తనకు వచ్చిన కష్టాలు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. తనకు 63 ఏళ్ల వయస్సు ఉందని, నలుగురు చెల్లెళ్లు, కొడుకులు, కోడళ్లు ఉన్నారని తెలిపారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సొంత చెల్లెళ్లు, బిడ్డల పక్కన నిలువలేని పరిస్థితి దాపురించిందని కన్నీటి పర్యంతమయ్యారు.