మావోయిస్టు దళ సభ్యుడి లొంగుబాటు
ABN , First Publish Date - 2023-01-26T00:44:17+05:30 IST
ములుగు జిల్లాలో మావోయిస్టు దళ సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ములుగు కలెక్టరేట్, జనవరి 25: ములుగు జిల్లాలో మావోయిస్టు దళ సభ్యుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ వివరాలు వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూరు మండలం రాయబంధం పరిధిలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన మడకం భీమ అలియాస్ రాకేష్ చిన్నప్పటి నుంచి మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలు, మిలీషియాలో కొనసాగుతున్నాడు. 2012లో పామేడు ఎల్వోఎస్ కమాండర్ అఖిల ప్రోద్బలం తో మావోయిస్టు పార్టీలో చేరాడు ఆ తర్వాత బెటాలియన్ నంబర్ 1 (హిడుమా బెటాలియన్)లో చేరి 2017 వరకు పనిచేశాడు. అదే క్రమంలో కసలపాడు ఎదు రుకాల్పుల్లో పాల్గొన్నాడు. ఆ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు, 14 మంది పోలీసులు మరణించారు. పడిమేల ఎదురుకాల్పుల్లోనూ భీమ పాల్గొన్నాడు. ఆ ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు గాయపడ్డారు. కొంతమంది పోలీసు లు మరణించారు. పొట్టంగుపాడు(కిష్టాపురం) వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో భీమ పాల్గొనగా ఆ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు, కొంతమంది పోలీసు లు గాయపడ్డారు. ఆతర్వాత మావోయిస్టుల సిద్ధాంతాలు నచ్చక ఆ పార్టీ నుంచి భీమ బయటకు వచ్చేశాడు. అనంతరం మావోయిస్టులు ఒత్తిడి చేయడంతో స్వగ్రామం కోమటిపల్లిలో ఉంటూ పార్టీ కోసం మళ్లీ పనిచేశాడు. చివరికి పార్టీలో పనిచేయడం ఇష్టంలేక తెలంగాణలోని బంధువుల ఇంటికి వచ్చి లొంగిపోయాడని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ గౌస్ ఆలం, ములుగు ఏఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. లొంగిపోయిన భీమకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రివార్డును ఎస్పీ అందజేశారు.