నేడు కేటీఆర్ రాక
ABN , First Publish Date - 2023-05-05T00:14:29+05:30 IST
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం హనుమకొండ జిల్లా పర్యటనకు వస్తున్నారు.
నగరంలో రూ.181.45 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బిజీ షెడ్యూల్
ఫాతిమానగర్లో బహిరంగసభ
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్విప్ వినయభాస్కర్, ఎమ్మెల్యే నరేందర్
హనుమకొండ టౌన్, మే 4 : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం హనుమకొండ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా రూ.181.45 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండలోని కిట్స్ కళాశాలకు చేరుకుంటారు. మంత్రి కేటీఆర్ దాదాపు ఆరుగంటల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్సరెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ సుందర్రాజ్, పోలీస్ కమిషనర్ రంగనాథ్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్తో భేటీ అయ్యారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి కేటీఆర్ పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు.
హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయం, టీవీ టవర్ కాలనీలోని వైకుంఠధామం, సెయింట్ గ్యాబ్రియేల్ స్కూల్ ఆవరణలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, కేటీఆర్ పర్యటనను పురస్కరించుకుని నేతలు నగరాన్ని గులాబీ మయం చేశారు. కిట్స్ కళాశాల నుంచి హనుమకొండ, ఫాతిమా నగర్ వరకు పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రతీ జంక్షన్లో పెద్ద ఎత్తున నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, అధికారులు కేటీఆర్ పర్యటన విజయవంతానికి భారీగా ఏర్పాట్లు చేశారు.
పర్యటన షెడ్యూల్
ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో హుస్నాబాద్ చేరుకుంటారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసి పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు భోజన విరామం
3 గంటలకు ఎర్రగట్టు గుట్టవద్ద గల కిట్స్ కళాశాల చేరుకుని ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం కిట్స్ కళాశాల సమీపంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ క్రికెట్ కప్ ట్రోఫీ అందజేస్తారు.
4.30 గంటలకు హనుమకొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.
5గంటలకు హనుమకొండ లష్కర్ బజార్ హైస్కూల్లో నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.
5.30 గంటలకు వరంగల్ రంగశాయిపేట శివారులోని నాయుడు పెట్రోల్పంపు వద్ద బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ.
6 గంటలకు హనుమకొండ ఇందిరానగర్లో రాష్ట్ర రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు నివాసానికి రాక.
6.15 గంటలకు హనుమకొండ గాంధీనగర్లో (57వ డివిజన్) మోడల్ వైకుంఠధామం ప్రారంభోత్సవం.
6.45గంటలకు కాజీపేట ఫాతిమానగర్లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్ వెళ్తారు.
25 అభివృద్ధి పనులు.. రూ.183.95 కోట్లు..
ఒకే చోట శంకుస్థాపనలు చేయనున్న కేటీఆర్
జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), మే 4: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యుఎంసీ) బల్దియా ఆధ్వర్యంలో రూ.183.95 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మించే వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 25 పనులు ఉండగా హసన్పర్తిలో వైకుంఠధామం, ఆధునిక దోభీఘాట్ నిర్మాణం, పరకాల నియోజకవర్గ పరిధిలోని కీర్తినగర్లో మినీ స్టేడియం, వర్ధన్నపేట నియోజ కవర్గ పరిధిలోని జక్కలొద్దిలో మినీ స్టేడియం మినహా మిగతా 21 పనుల న్నీ కూడా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోనివే. 25 అభివృద్ధి పను లలో హనుమకొండ వ్యాంబే కాలనీలోని మోడల్ వైకుంఠధామం, హంటర్ రోడ్డు సైన్స్ పార్కు, ఎస్సీ, ఎస్టీ సెంటర్ల ప్రారంభోత్సవాలు ఉండగా, మిగిలిన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
రెండు మినహా, అన్నీ ఒకే చోట..
హంటర్రోడ్డులోని సైన్స్ పార్కు, హనుమకొండ 57వ డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ భవన్ మార్గంలోని వ్యాంబే కాలనీలో నిర్మాణమైన మోడల్ వైకుంఠధామాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారు. ఇక మిగతా పనుల ప్రారంభో త్సవాలు, శంకుస్థాపనలన్నీ హనుమకొండ లష్కర్బజార్ ప్రాక్టీసింగ్ హైస్కూల్ ఆవరణలోనే జరపనున్నారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సిద్దం చేశారు.
పనుల వివరాలు:
మోడల్ వైకుంఠధామం, హంటర్రోడ్డు సైన్స్ పార్కు, ఎస్సీ, ఎస్టీ సెంటర్ మొత్తంగా రూ.13.5 కోట్లు
హనుమకొండలో మినీ స్టేడియం.....రూ.5 కోట్లు
బంధం చెరువు అభివృద్ధి.....రూ.3.15 కోట్లు
పట్టణ ప్రగతి ద్వారా రూ.24 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనుల నిర్మాణం
పోతననగర్, బాలసముద్రంలో రూ.3.58 కోట్లతో సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్మాణం
రూ. 70.58 కోట్ల నిధులతో నయీంనగర్ నాలా రిటెయినింగ్ వాల్ నిర్మాణం
రూ. 30 కోట్లతో భద్రకాళి ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణం
రూ.5 కోట్లతో కాజీపేటలో షాదీఖానా నిర్మాణం
31వ డివిజన్లో రూ.5.86 కోట్లతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం
జక్కలొద్దిలో మినీ స్టేడియం... రూ. 5 కోట్లు.