సల్లంగ సూడు ఐలోని మల్లన్న
ABN , First Publish Date - 2023-01-16T23:53:43+05:30 IST
ఐలోని మల్లన్నా.. సల్లంగ సూడూ.. అంటూ ఐనవోలు క్షేత్రం మారుమోగింది. భక్తులు స్వామి వారిని కొలుస్తూ పరవశించిపోయారు. పూసల లాగులు.. గజ్జెల మోత.. డోలు శబ్దాలు.. చేతుల్లో వీరకోలు.. త్రిశూలాలు.. ఖడ్గాలు.. నొదుటిపై బండారి పసుపు.. నెత్తిపై బోనాలతో శివసత్తులు జానపద గేయాలతో నృత్యాలు చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి తన్మయత్వం చెందారు. ఒగ్గు పూజారుల అందమైన పిండి పట్నాలు, ఢమురక శబ్దాలతో సకల భాగ్యాలు కలిగి సంతోషాన్ని కలిగించాలని పర్వతాల మల్లయ్య సల్లంగ సూడాలని స్వామి వారిని వేడుకున్నారు.
భక్తజనంతో పోటెత్తిన శైవ క్షేత్రం
వైభవంగా మల్లికార్జునస్వామి జాతర
సంక్రాంతి రోజున భారీగా తరలివచ్చిన భక్తులు
స్వామి వారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సినీ నటి పూనమ్ కౌర్
మహా నివేదనతో దేవుడి రథం ఉరేగింపు
ఐలోని మల్లన్నా.. సల్లంగ సూడూ.. అంటూ ఐనవోలు క్షేత్రం మారుమోగింది. భక్తులు స్వామి వారిని కొలుస్తూ పరవశించిపోయారు. పూసల లాగులు.. గజ్జెల మోత.. డోలు శబ్దాలు.. చేతుల్లో వీరకోలు.. త్రిశూలాలు.. ఖడ్గాలు.. నొదుటిపై బండారి పసుపు.. నెత్తిపై బోనాలతో శివసత్తులు జానపద గేయాలతో నృత్యాలు చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి తన్మయత్వం చెందారు. ఒగ్గు పూజారుల అందమైన పిండి పట్నాలు, ఢమురక శబ్దాలతో సకల భాగ్యాలు కలిగి సంతోషాన్ని కలిగించాలని పర్వతాల మల్లయ్య సల్లంగ సూడాలని స్వామి వారిని వేడుకున్నారు.
ఐనవోలు, జనవరి 16: సంకాంత్రి పర్వదినం రోజున మల్లికార్జునస్వామి మహాజాతర భక్తులకు ఆధ్యాత్మిక చింతనను కలిగించింది. సంస్కృతీ సంప్రదాయాలు, జానపదులకు ప్రతీకగా బండారితో మల్లన్న క్షేత్రం పసుపుమయమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం నుంచి మొదలైన భక్తులరాక.. అర్ధరాత్రి వరకు రద్దీగా కొనసాగింది. తొలుత ఆలయంలో అర్చకులు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, బిల్వార్చన మహానివేదన నీరాజన ఉణ్యాహవాచనము పూజలు జరిపారు. మల్లికార్జునస్వామికి వెండికిరీటం, కవచం సుగంధాలు వెదజల్లే పుష్పమాలతో దేదిప్యమానంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి తెల్లవారు వరకు అభిషేకాలు దర్శనాలు జరిగాయి.
దేవుడి రథం
మార్నేని వంశీయుల ఆధ్వర్యంలో అనాదిగా వస్తున్న మహానివేదన దేవుడి రథంను డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు స్వగృహంలో సుందరంగా తీర్చిదిద్దారు. మహానివేదనతో బయలుదేరిన రథం గ్రామ పురవీధుల గుండా ఆలయానికి చేరుకొని మూడు సార్లు ప్రదక్షణ చేసింది. మంగళహారథులతో రథంకు మహిళలు స్వాగతం పలికారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రభ బండ్లు రఽథంను అనుసరించాయి. దేవుడి రథం ప్రదర్శన సాయంత్రం 7నుంచి తెల్లవారువరకు కొనసాగింది. రథంతో వచ్చిన రవీందర్రావును ఈవో నాగేశ్వర్రావు సంప్రదాయ పద్ధతిలో సన్మానించారు.
7 లక్షల మంది రాక
ధ్వజారోహణం రోజు ముందు నుంచి సోమవారం వరకు సుమారు 7 లక్షల మంది భక్తులు స్వామి వారి ని దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు అం చనా వేస్తున్నారు. 17న సంప్రోక్షణ క్రతువు తర్వాత ఉగాది వరకు జరిగే వారాంతపు జాతరలు ప్రతీ ఆది, బుధ 9 వారాలపాటు జరుగుతాయి. అప్పటివరకు సుమారు 10లక్షల మంది భక్తులు తరలివచ్చి మొక్కు లు చెల్లించి దర్శనం చేసుకుంటారని చెబుతున్నారు.
ప్రముఖుల సందడి
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి దంపతులు, మాజీ మేయర్ దంపతులు ఎర్రబెల్లి స్వర్ణ - వరుదరాజేశ్వర్రావులతో కలిసి సినీనటి పూనం కౌర్, మంత్రి దయాకర్రావు సతీమణి ఉషతోపాటు కుటుంబసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, మార్తినేని ధర్మారావు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో అద్దంకి నాగేశ్వర్రావు నేతృత్వంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శేషవస్త్రాలు బహుకరించి తీర్థ ప్రసాదం అందించి ఆశీర్వచనం చేశారు.
పోలీసులు సేవలు
జాతరలో పోలీ్ససేవలు భేష్గా నిలిచాయి. మామునూరు ఏసీపీ నరే్షకుమార్ నేతృత్వంలో పర్వతగిరి సీఐ అనుముల శ్రీనివాస్, ఐనవోలు ఎస్సై జి.వెంకన్న ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది సుమారు 400 మంది జాతర బందోబస్తును నిర్వహించారు. జాతర సందర్భంగా సీపీ రంగనాథ్, డీసీపీ వెంకటలక్ష్మిలు జాతర బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచలను సలహాలు చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటేడ్ చెక్పోస్టు ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా నీడన జాతర బందోబస్తును పర్యవేక్షించారు.