కాటేసిన కాళరాత్రి
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:24 AM
ఆ రాత్రి వారికి కాళరాత్రే అయింది.. వేములవాడ రాజన్న దర్శనం కోసం బయలుదేరిన వారిని విధి క్రూరంగా కాటేసింది... నిద్రలో ఉండగానే వారి ప్రాణా లను కబళించింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట గ్రామ శివారులో హనుమకొండ-కరీంనగర్ (ఎన్హెచ్ -563) ప్రధాన రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం
మరో ఇద్దరి పరిస్థితి విషమం
ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట వద్ద లారీ-కారు ఢీ
మృతులందరూ రెండు కుటుంబాలకు చెందిన వారు
వేములవాడ రాజన్న సన్నిధికి వెళ్తుండగా ఘటన
మృతుల స్వస్థలమైన ఏటూరునాగారంలో తీవ్ర విషాదం
పూర్తిగా కనుమరుగైన మంతెన కాంతయ్య కుటుంబం
ఎల్కతుర్తి/ఏటూరునాగారం రూరల్, డిసెంబరు 22: ఆ రాత్రి వారికి కాళరాత్రే అయింది.. వేములవాడ రాజన్న దర్శనం కోసం బయలుదేరిన వారిని విధి క్రూరంగా కాటేసింది... నిద్రలో ఉండగానే వారి ప్రాణా లను కబళించింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట గ్రామ శివారులో హనుమకొండ-కరీంనగర్ (ఎన్హెచ్ -563) ప్రధాన రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రెండు కుటుంబా లకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై రాజ్కుమార్, బంధువులు తెలిపిన వివారాలిలా ఉన్నాయి..
ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన మంతె న కాంతయ్య(65)కు భార్య రేణుక(46), కుమార్తె రాధ చందన (16) ఉన్నారు. అలాగే మంతెన శంకరాచారి (60)కి భార్య శ్రీదేవి, కుమారులు భార్గవ్, భరత్ (29) ఉన్నారు. కాంతయ్య, శంకరాచారి వరుసకు అన్నదమ్ములు అవుతారు. రెండు కుటుంబాలకు చెందిన ఏడుగు రు కలిసి కారులో వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి గురువారం రాత్రి సుమారు 11గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరారు. శంకరాచారి కుమారుడు భరత్ కారు నడిపాడు. ఈయన అయ్యప్ప స్వామి మాల ధరించి వున్నాడు.
అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వరంగల్ వైపు వెళుతున్న లారీని వేగంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అయి రోడ్డు కింద వైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మంతెన కాంతయ్య, అతడి కూతురు రాధచందన, అలాగే మంతెన శంకరాచారి, అతడి చిన్నకుమారుడు భరత్ తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న రేణుక, శ్రీదేవి, భార్గవ్లు కారులో ఇరుక్కుపోయి తీవ్రగాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై గోదారి రాజ్కుమార్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుకున్న రేణుక, శ్రీదేవి, భార్గవ్ తమను బయటకు తీయాలం టూ హాహాకారాలు చేస్తూ రోదిస్తుండటంతో... ఎక్స్కవేటర్ సహాయంతో శిథిలాలను తొలగించి వారిని బయటకు తీశారు. తీవ్రగాయాలపాలైన రేణుక, శ్రీదేవి, భార్గవ్లను 108 ఆంబులెన్స్లో చికిత్స కోసం ఎంజీఎం ఆస్ప త్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను ట్రాక్టర్లో ఎంజీఎం మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లారు.సంఘటన స్థలాన్ని సెంట్రల్జోన్ డీసీపీ ఎంఏ బారి, ఏసీపీ డేవిడ్రాజ్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.
కారులో ఏడుగురి ప్రయాణం
మేడారం జాతరకు ముందస్తుగా వేములవాడ రాజరాజేశ్వరస్వామికి మొక్కలు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా అదే కారులో బయలుదేరి వెళ్లారు. అయితే ఐదుగురు వ్యక్తులు ప్రయాణించే కారులో ఏడుగురు వ్యక్తులు ప్రయా ణం సాగించి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. శంకరాచారి చిన్న కుమారుడు భరత్ కారు నడపగా, నిద్రలేకుండా వాహనం నడుపుతున్న క్రమంలో ప్రమాదం సంభవించి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చికిత్స పొందుతూ రేణుక మృతి
ప్రమాదంలో మంతెన కాంతయ్య భార్య రేణుక(46) తీవ్రంగా గాయపడగా, ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీ ఎం తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం రాత్రి కన్నుమూసింది. ముగ్గురూ మృతిచెం దడంతో కుటుంబం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినట్ల యింది.
ఏటూరునాగారంలో విషాదం
ఈ ఘటన ఏటూరునాగారం మండలంలో పెను విషాదాన్ని మిగిల్చింది. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో పలువురితో మంతెన శంకర్ కుటుంబానికి సత్సంబంధాలు ఉండడంతో వారు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. వారి మరణాన్ని తలుచుకొని కంటతడి పెట్టారు. ఏటూరునాగారానికి మంతెన శంకర్, మంతెన భరత్, మంతెని కాంతయ్య, మంతెని చందనల మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం బంధువులు ఏటూరునాగారంలోని స్వగృహాలకు తరలించగా, సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
మంత్రి సీతక్క దిగ్ర్భాంతి
ఎల్కతుర్తి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా అధికారులకు సూచించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చేయూతనందించారు.
మిన్నంటిన రోదనలు
హనుమకొండ అర్బన్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిని ఎంజీఎం మార్చురీకి తరలించగా, వారి బంధువులు, స్నేహితుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఏటూరునాగారం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు ఎంజీఎం మార్చురీకి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతదేహాలను స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేవారు. కాగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన భార్గవ్, శ్రీధర్లను నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
అంత్యక్రియలకు స్వచ్ఛందంగా ఏర్పాట్లు
ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడంతో ఏటూరునాగారం గ్రామస్తులంతా తరలివచ్చారు. వారి అంత్యక్రియల కోసం తక్షణంగా రూ.30వేలు పోగు చేసినట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్ వెంకన్న తెలిపారు. రెండు అంబులెన్సులు కూడా తెప్పించామన్నారు. జరగబోయే కార్యక్రమాలకు కూడా అండగా ఉంటామని తెలిపారు.
కనుమరుగైన కాంతయ్య కుటుంబం..
మృతుడు మంతెన కాంతయ్య గ్రామంలో కుల వృత్తి (కమ్మరి పని) చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈయన భార్య రేణుక గ్రామంలో కూలి పనికి వెళుతుండేది. వివాహమైన తర్వాత చాలా సంవత్సరాలకు రాధచందన జన్మించింది. ఆలస్యంగా సంతానం కలగడంతో కూతురును అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. రాఽధచందన ఏటూరునాగారంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ప్రమాద ఘటనలో కాంతయ్య, రేణుక రాధచందన మృతిచెందడంతో కుటుంబమంతా కనుమరుగైపోయింది.
శంకరాచారి కుటుంబంలో ఇద్దరు...
మరో మృతుడు మంతెన శంకరాచారి ఏటూరునాగారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఈయనకు భార్య శ్రీదేవి, ఇద్దరు కుమారులు భార్గవ్, భరత్ ఉన్నారు. పెద్ద కుమారుడు భార్గవ్ వాజేడు తహసీల్దార్ కార్యాలయంలో ధరణి అపరేటర్గా విధులు నిర్వహిస్తుడగా, చిన్న కుమారుడు భరత్ మహాదేవపూర్లోని ఇసుక క్యారీలో సూపర్వైజర్గా పనిచేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. ప్రమాద ఘటనలో శంకరాచారి, భరత్లు మృతి చెందారు. శ్రీదేవి, భార్గవ్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.