నీట మునగాల్సిందేనా..?!

ABN , First Publish Date - 2023-05-26T00:43:44+05:30 IST

గోదావరి ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు కష్టాలు తీరటం లేదు. వానాకాలం వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది.

నీట మునగాల్సిందేనా..?!
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో గోదావరి వరదలకు నీట మునిగిన దామెరకుంట గ్రామం (ఫైల్‌)

ప్రమాదకరంగా గోదావరి కరకట్టలు

గత వానాకాలం జలమయమైన లోతట్టు గ్రామాలు

ఏటూరునాగారం వద్ద కరకట్టల మరమ్మతులకు రూ.137 కోట్లు

సీఎం కేసీఆర్‌ పరిశీలించినా నిర్మాణానికి లభించని మోక్షం

పునరుద్ధరణకు నిధులు కేటాయించని ప్రభుత్వం

కాళేశ్వరంలో గోదావరి కోతలకు నీట మునుగుతున్న పంటలు, ఊళ్లు

భూపాలపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి) : గోదావరి ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు కష్టాలు తీరటం లేదు. వానాకాలం వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. గత ఏడాది జూలైలో భారీ వరదలతో గోదావరి పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. వేలాది కుటుంబాల పునరావాస కేంద్రాల్లో తల దాచుకోవాల్సి వచ్చింది. గోదావరి కరకట్టలు కోతకు గురికావటం వల్లే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని గుర్తించినప్పటికీ వాటి మరమ్మతుల ఊసెత్తటం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్‌ కరకట్టల పునరుద్ధరణకు హామీ ఇచ్చినా అమలుకు నోచుకోవటం లేదు. వానాకాలం సమీపిస్తుండటంతో మళ్లీ తమకు ఇబ్బందులు తప్పవేమోనని లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఏటా గోదావరి తీరం కోత..

గోదావరి పరీహవాక ప్రాంతాలకు వానాకాలం భయం వెం టాడుతోంది. జూలైలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద బీభత్సం సృష్టించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వందలాది గ్రామాలు, వేలాది ఎకరాల పంట లు ముంపునకు గురయ్యాయి. వరద నీరు గోదావరి తీరం పక్కన ఉన్న గ్రామాల్లో ప్రజలను ఊళ్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వేలాది మంది ప్రజలు కట్టుబట్టలతో నీట మునిగిన ఇళ్లను వదిలేసి, పునరావాస కేంద్రా ల్లో తల దాచుకున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సాగు భూములు గోదావరిలో కలిసి పోవటంతోపాటు ఇసుక మేటలు వేయటంతో రైతన్నలకు కన్నీరే మిగిలింది. ప్రతి ఏటా గోదావరి తీరం వెంట కరకట్టలు కోతకు గురవుతండటంతో పంటపొలాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఊళ్ల కు ఊళ్లే నీట మునుగుతున్నాయి. కరకరట్టలకు మరమ్మతులు లేకపోవటంతో ఏటేటా మరింత ఎక్కువ కోతకు గురై నష్టం భారీగా పెరుగుతోంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ప్రమాదపుటంచున బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

రూ.88 కోట్లతో ప్రతిపాదనలు

భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో లక్ష్మీపురం, గంగారం గ్రామాల మధ్య కరకట్ట కోతకు గురవుతున్నాయి. లక్ష్మీపురం వద్ద గోదావరిలో మానేరు నది కలుస్తుంది. రెండు నదులు కలిసే చోటు కావటంతో పాటు గోదావరిలోకి వచ్చే వరద వెనక్కి మానేరులోకి వస్తుండటంతో మానేరు, గోదావరి తీరాలు కోతకు గురవుతున్నాయి. జూలైలో దామెరకుంట గ్రామం మొత్తం గోదావరి వరదలో మునిగిపోయింది. వానాకాలం వచ్చిందటే దామెరకుంట, గంగారం, లక్ష్మీపురం, గుండ్రాజుపల్లి, విలసాగర్‌ తదితర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో లక్ష్మీపురం నుంచి గంగారం వరకు తొమ్మిది కిలో మీటర్ల మేర కరకట్ట నిర్మాణం చేపట్టడానికి రూ.88కోట్ల అంచనాలతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. మూడు నెలల్లో పనులు చేపట్టాలని ఆదేశించిన ప్రభుత్వం పైసా నిధులు ఇప్పటి వరకు కేటాయించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ముంపు తీవ్రత పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.

నిధులున్నా.. పనులేవీ..?

ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో గోదావరి తీరం ఎక్కువగా కోతకు గురవుతోంది. దీంతో లోత ట్టు ప్రాంతాలు నీట మునుగుతుండటంతో 2007లో అప్పటి ప్రభుత్వం ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో 10 కిలో మీటర్ల వరకు కరకట్ట నిర్మాణం చేసేందుకు నిధులు మం జూరు చేసింది. రూ.75కోట్ల నిధులను అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. అయితే.. ఏటూరునాగారం మండలం రాంనగర్‌, మంగపేట మధ్య రూ.46.44 కోట్ల వ్యయంతో రివిట్‌మెంట్‌, లాంచింగ్‌ ఆఫ్రాన్‌లతో కరకట్ట నిర్మించారు. కన్నాయిగూడెం మండలం కన్నాయిగూడెం, ఏటూరు, గంగారం, ఐలాపూర్‌, మంగపేట మండలం కమలాపూర్‌, మల్లారం గ్రామ శివారుల్లో కరకట్టల నిర్మాణానికి భూసేకరణ అడ్డుగా మారింది. 48 ఎకరాల పట్టా భూమి, మరో 138 ఎకరాల అసైన్డ్‌ భూములకు పరిహరం చెల్లించే విషయంలో వివాదం తలెత్తింది. దీంతో కరకట్ట నిర్మాణ పనులు నిలిచిపోయాయి. 2017లో మరోసారి ప్రభుత్వం సాగునీటి ఏజెన్సీల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. నాలుగేళ్ల తర్వవత 2021లో ఎట్టకేలకు ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లో కరకట్టల నిర్మాణానికి రూ.137.23 కోట్ల నిధులు కేటాయించింది. 16కిలో మీటర్ల మేర కరకట్ట నిర్మాణానికి అప్పట్లోనే టెండర్లు నిర్వహణ కూడా పూర్తి చేశారు. అయితే.. ఇప్పటి వరకు కూడా పనులు మాత్రం మొదలు కాకపోవటంపై స్థాఽనికుల్లో అసంతృప్తి వ్యకమవుతోంది. నిధులు ఉన్నప్పటికీ ఐదారేళ్లుగా కరకట్టల నిర్మాణ పనులు చేపట్టకపోవటంతో ముంపుతో లోతట్లు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీగా నష్టం వాటిల్లింది. దీంతో జూలై 17న సీఎం కేసీఆర్‌ భద్రాచలంతో పాటు ఏటూరునాగారంలో పర్యటించారు. ఈ సందర్భంగా అనేక హమీలు ఇచ్చారు. ప్రధానంగా ముంపు అనేది భవిష్యత్తులో లేకుండా చేస్తానని మాటిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో రెండు, మూడు వేల ఇళ్లు నిర్మించేందుకు సింగరేణితో కలిపి రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. బాధితులకు ప్రత్యేక కాలనీలు నిర్మిస్తామన్నారు. అలాగే ములుగు జిల్లా ఏటూరునాగారంలోనూ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని, భవిష్యత్తులో ముంపు ముచ్చటే లేకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఏటూరునాగారం వద్ద గోదావరి కరకట్ట వల్లే వరదలు వస్తున్నాయని అధికారులు తెలపటంతో, రూ.137కోట్ల నిధులు రెడీగా ఉన్నాయని, త్వరలోనే పనులు మొదలు పెడతామని సీఎం చెప్పారు. ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలకు బాధితులను తరలించేందుకు నిధులు విడుదల కాకపోగా, ఆ దిశగా అధికారులు ఎలాంటి పనులు కూడా చేపట్ట లేదు. అలాగే ఏటూరునాగారం వద్ద కరకట్ట మరమ్మతులకు రూ.137కోట్ల నిధులు ఉన్నా పనులు మాత్రం జరగటం లేదు. కరకట్టల నిర్మాణం పనులను రీడిజైన్‌ చేయాలని సీఎం ఆదేశాల మేరకు అధికారులు రీడిజైన్‌ చేసి సీఎంవోకు పంపించినప్పటికీ ఫైలుకు మోక్షం లభించటం లేదని సమాచారం. మళ్లీ వానాకాలంలో వరదలు వస్తే మరోసారి నీట మునుగాల్సిందేనా..? అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ నిద్రలేని కాళారాత్రులను మళ్లీ గడుపాల్సి వస్తుందనే భయం స్థానికులను వెంటాడుతోంది. స్వయంగా సీఎం కేసీఆర్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటించి, హామీ ఇచ్చిన సమస్యలే పరిష్కారం కాకపోతే.. ఇక ఆయన పర్యటించి ప్రయోజనం ఏమిటని ముంపు ప్రాంతాల ప్రజలు అంటున్నారు. లోతట్టు నుంచి సురక్షిత ప్రాంతాల్లో ఇళ్ల సముదాయాలు నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని, కరకట్టలను బలోపేతం చేసేందుకు పనులు మొదలు పెట్టాలని, గోదావరిలోకి వరదలు రాకముందే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - 2023-05-26T00:43:44+05:30 IST